సారంగాపూర్, నవంబర్ 21: ‘నాటి కాంగ్రెస్ పాలన కరెంట్ కష్టాలు మళ్లీ కావాలా..? 24 గంటల ఉచిత కరెంట్తో పచ్చని పంటలతో కలిగే సాగు సంబురం కావాలా..? మీరే ఆలోచించుకోవాలని’ జగిత్యాల అభ్యర్థి, డాక్టర్ సంజయ్ కుమార్ రైతులకు పిలుపునిచ్చారు. నాడు ప్రతి ఇంటికి ఒక టార్చి లైట్ ఉండేదని, ఎవరైనా మనకు తెల్సినవాళ్లు దుబాయ్, గల్ఫ్ దేశాల్లో ఉంటే ఒక లైట్ తెమ్మని చెప్పేదని, ఇప్పుడా సమస్య లేదని, 24గంటల కరెంట్ ఉంటున్నదని వివరించారు. మంగళవారం బీర్పూర్ మండలం తుంగూర్, కొల్వాయి, రేకులపల్లి, తాళ్లధర్మారం, కోమన్పల్లి, డోంకేశ్వరం, చిన్న కొల్వాయి గ్రామాల్లో లైబ్రరీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ సాగుకు 24 గంటల కరెంట్ ఇస్తుంటే.. కాంగ్రెస్ ఎందుకని మాట్లాడుతున్నదని, మూడు గంటలే ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మాట్లాడుతున్నాడన్నారు. ఇంకా 10 హెచ్పీ మోటర్ పెట్టుకోవాలని అంటున్నడని, ఆ మోటర్ వాళ్లు కొనిస్తరా..? చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లుండే..? ఇప్పుడెట్లుంది..? ఒకసారి ఆలోచించాలని సూచించారు. నాటికీ నేటికి తేడాను గమనించాలని కోరారు. నిరంతర కరెంట్తో ఏ ఊళ్లో ఎటు చూసినా పంటపొలాలే కనిపిస్తున్నాయని, పుట్లకొద్ది ధాన్యం పండుతున్నదని, ఇదంతా సీఎం కేసీఆర్ కృషికి ఫలితమన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో విద్య వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. జిల్లా కేంద్రంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి, నిరుపేదలకు అందించామన్నారు. రాబోయే రోజుల్లో గ్రామాల్లోనూ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు.
ఇంకా రైతుబీమా తరహాలోనే ప్రతి పేద వ్యక్తికి రూ.5లక్షల ఉచిత బీమా చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతున్నదని, పేదల, రైతుల, మహిళల పక్షపాతి ప్రభుత్వంగా బీఆర్ఎస్ పేరుగాంచిందన్నారు. తానొక్కటే చెబుతున్నానని, కాంగ్రెస్ మాటలు నమ్మితే మోసపోతారని, రాష్ట్రం అంధకారమవుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో 44లక్షల మందికి రైతు బీమా కల్పించామని, రైతుల మాదిరే రాష్ట్రంలో ఉన్న 50లక్షల మంది పేదలకు రూ.5లక్షల బీమా కల్పిస్తామన్నారు. ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్నామని, కొత్తగా మహిళలందరికీ సౌభాగ్యలక్ష్మీ పథకం ద్వారా నెలకు రూ.3వేల పింఛన్ ఇస్తామన్నారు. రెండు సార్లు మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి సారంగాపూర్ మండల అభివృద్ధిని గాలికొదిలేసిండని, కనీసం రోళ్లవాగులో తట్టెడు మట్టితీసిన పాపాన పోలేదన్నారు. స్వరాష్ట్రంలో రూ.136కోట్లతో రోళ్లవాగు ప్రాజెక్ట్ను ఆధునీకరించామని, 99శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన ఒక్క శాతం కూడా అటవీ అనుమతుల కారణంగా ఆలస్యమవుతున్నదని వివరించారు.
అటవీ అనుమతులు కేంద్రం పరిధిలో ఉంటాయని, బీజేపీ నాయకులు ఎందుకు పట్టించుకోవడం లేదో ప్రశ్నించాలన్నారు. 2004 నుంచి 2014 దాకా పదేండ్లు కేంద్ర, రాష్ర్టాల్లో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ బీర్పూర్ మండలంలోని ఒక్క చెరువును బాగు చేయలేదని, బీఆర్ఎస్ వచ్చాకనే చెరువులకు పూర్వవైభవం తెచ్చినట్లు చెప్పారు. ప్రతి గ్రామానికి రోడ్లు వేశామన్నారు. తుంగూర్కు మంజూరైన దంత వైద్యశాలకు స్థలం లేక వేరే వద్ద నడుస్తున్నదని, ఎవరైనా దాతలు దవాఖానకు స్థలం ఇస్తే దానిని బీర్పూర్ మండలంలో ఏర్పాటు చేస్తామన్నారు. ‘నేను మీ బిడ్డను. నిరంతరం మీ మధ్యలోనే ఉంటా. మరోసారి ఆశీర్వదిస్తే.. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని’ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 30న కారు గుర్తుకు ఓటేసి భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యేకు మహిళలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సన్మానించారు. బైక్ ర్యాలీలు నిర్వహించారు. పాటల సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో కేడీసీసీబీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్ రావు, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కొల్ముల రమణ, పార్టీ అధ్యక్షుడు నారపాక రమేశ్, ప్రధాన కార్యదర్శి శీలం రమేశ్, ఉపాధ్యక్షులు జక్కినపెల్లి శ్రీనివాస్ రావు, రామకిష్టు గంగాధర్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ మెరుగు రాజేశం, స్థానిక ప్రజాప్రతినిధులు మేసు ఏసుదాసు, ఎలగందుల లక్ష్మి, నల్లమైపాల్ రెడ్డి, నారపాక రమ, రవీందర్, రమేశ్, గర్షకుర్తి శిల్ప-రమేశ్, రిక్కల ప్రభాకర్, ఎడ్ల సృజన, భీమక్క, పర్వతం రమేశ్, అజ్మీర ప్రభాకర్, బోడ స్వప్న, చిక్రం సుగుణ, బందెల మరియా, చుంచు శారద, అజయ్ పాల్గొన్నారు.