జగిత్యాల రూరల్, మే 26: చెరువులకు స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు పూర్వ వైభవం తెచ్చిందని, ఈ మండువేసవిలోనూ నిండుగా నీటితో కళకళలాడేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కొనియాడారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్లో జడ్పీ నిధులు రూ.5లక్షలతో బతుకమ్మ ఘాట్ నిర్మాణానికి జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే ఎంపీ దామోదర్ రావు మంజూరు చేసిన 5 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత సహకారంతో నియోజకవర్గంలో ప్రతి చెరువు వద్ద బతుకమ్మ ఘాట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నేడు నర్సింగాపూర్లో జడ్పీ నిధులతో బతుకమ్మ ఘాట్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రామానికి 30 కోట్ల నిధులు వచ్చాయని, బీడీలు చేసే ఆడబిడ్డలకు పింఛన్లు, రైతులకు రైతు బంధు ఇస్తున్నామని చెప్పారు. ఆసరా పింఛన్ల కింద 9 కోట్ల దాకా అందజేసినట్లు తెలిపారు.
జగిత్యాల పట్టణంలో 14 వార్డుల్లో 120 సర్వే నంబర్లను జోన్ల మార్పిడి చేశామని, మాస్టర్ ప్లాన్ రద్దుకు కృషి చేస్తానని చెప్పారు. మంత్రితో మాట్లాడానని, వారంలో రద్దు జీవో తీసుకొస్తామని తెలిపారు. అనంతరం మోతుకు గంగారాంకు చెందిన గొర్రె పిల్లను ఎత్తుకున్నారు. గొర్రెల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ దయతో మా బతుకులు బాగుపడ్డాయని, చేతినిండా ఉపాధి దొరుకుతున్నదని గంగారాం యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. కాగా, అంతకుముందు గ్రామానికి చెందిన కుకునూరు భూమయ్య అనారోగ్యంతో మరణించగా, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నకల రాధ రవీందర్ రెడ్డి, సర్పంచ్ సరోజన మల్లారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మహేశ్, మాజీ సర్పంచ్ నరేశ్, మాజీ ఎంపీటీసీలు రాజ నర్సయ్య, కుడుకల లక్ష్మణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు గంగారెడ్డి, సర్పంచులు చెరుకు జాన్, ప్రకాశ్, గంగాధర్, నాయకులు ఎల్ల రాజన్న, గంగారాం, ఆనంద్ రావు, మల్లేశం గౌడ్, తిరుపతి, గోపి, తిరుపతి గౌడ్, ఎంపీడీఓ రాజేశ్వరి, ఏఈ రాజ మల్లయ్య ఉన్నారు.
అసత్య ప్రచారం నమ్మవద్దు
మన బతుకమ్మ సంసృతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనత జాగృతి అధ్యక్షురాలు కవితకే దక్కుతుంది. రైతులు, మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. మిషన్ కాకతీయలో భాగంగా చెరువులు జీవం పోసకున్నాయి. కాళేశ్వరం జలాలతో మండువేసవిలోనూ నీటితో కళకళలాడుతున్నాయి. ప్రతి పక్షాల అసత్య ప్రచారాలు నమ్మవద్దు. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం ఎమ్మెల్యే సంజయ్ కృషి చేస్తున్నారు. ప్రజలకు, రైతులకు అండగా ఉంటాం.
– దావ వసంత, జడ్పీ చైర్పర్సన్