రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల మున్సిపల్పై బీఆర్ఎస్ వరుసగా మూడోసారి జెండా ఎగురవేసి, చర్రిత సృష్టించింది. 39 వార్డులకు గాను అత్యధికంగా 27 వార్డులు కైవసం చేసుకోగా, తాజాగా మున్సిపల్ పీఠం దక్కించుకున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ కంచుకోటగా ఉంది. 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికలతో విజయాలు ప్రారంభమయ్యాయి. అదే విధంగా 2020లోనూ 22 స్థానాలు సాధించి మున్సిపల్ను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. తాజాగా, జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ అదేజోరు కోనసాగించి 39 వార్డులకు 27 స్థానాలు గెలుపొంది రికార్డు సృష్టించింది.
సోమవారం జరిగిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించగా చైర్పర్సన్గా 3వ వార్డు కౌన్సిలర్ జిందం కళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2020లోనూ జిందం కళ చైర్పర్సన్గా ఎన్నికై సేవలు అందించారు. ఆమె వరుసగా రెండోసారి చైర్పర్సన్గా ఎన్నికై సిరిసిల్ల మున్సిపల్ చరిత్రలో మరో రికార్డు సృష్టించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిందం కళకు వరుసగా రెండోసారి అవకాశం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే యువ తకు ప్రాధాన్యం ఇచ్చి, వైస్చైర్మన్ పదవిని 34వ వార్డు కౌన్సిలర్ దార్ల సందీప్కు అవకాశం కల్పించారు.