మెట్పల్లి రూరల్, నవంబర్ 24: “ఐదేళ్లకోసారి గ్రామాలకు వచ్చిపోయేవాళ్లు ఎన్నికల టూరిస్టులు. ఏం చేస్తారో చెప్పకుండా మాయమాటలు చెప్పి, మోసం చేస్తున్నరు. ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని పెద్ద స్కెచ్చే వేస్తున్నరు. అలాంటి వారిని నమ్మితే మోసపోతరు. జాగ్రత్త అంటూ’ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ప్రజలకు పిలుపునిచ్చారు. తానొక్కటే అడుగుతున్నానని, ప్రజల మధ్య చిచ్చుపెట్టి, లబ్ధి పొందేవాళ్లు కావాలా..? ప్రతిరోజూ ప్రజల మధ్యే ఉంటూ పనిచేసే నాయకులు కావాలా..? ఓటర్లు ఆలోచించుకోవాలని సూచించారు.
ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకు వస్తారని, వారికి ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. శుక్రవారం మెట్పల్లి మండలం చౌలమద్దిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్షో నిర్వహించగా, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంజయ్ మాట్లాడారు. దేశంలోని 16 రాష్ర్టాల్లో మహిళలు బీడీలు చేస్తారని, కానీ బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని వెల్లడించారు. పదేళ్లలో కేసీఆర్ ఏమీ చేయలేదని, 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని మాట్లాడే ప్రతిపక్ష పార్టీల నాయకులను మీ గ్రామాల్లోని కరెంటు తీగలు పట్టుకొమ్మని చెప్పాలని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ వచ్చాకనే 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు, ఆసరా పింఛన్లు వంటి సంక్షేమ పథకాలు అమలువుతున్నాయని తెలిపారు. ఇన్ని సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నా, పట్టింపు లేని ప్రతిపక్షాలు ఇక్కడ వంతెన నిర్మాణం పూర్తికాలేదని ప్రజలను రెచ్చగొడుతున్నాయని వివరించారు. కాంట్రాక్టర్ల అలసత్వం, అసమర్థ్దత వల్లే చౌలమద్ది వాగుపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం నెలకొందని పేర్కొన్నారు.
నిర్దేశిత సమయంలో పనులు చేయకపోవడంతో కాంట్రాక్టర్ను సైతం ప్రభుత్వం బ్లాక్లిస్టులో పెట్టిందన్నారు. పనులను మరో కాంట్రాక్టర్కు అప్పగించామని, త్వరలోనే వంతెన నిర్మాణం పూర్తవుతుందని హామీనిచ్చారు. కారు గుర్తుకు ఓటేసి మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు. ఇక్కడ ఎంపీపీ మారు సాయిరెడ్డి, సర్పంచ్ గడ్డం లింగారెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు తీగల లింగారెడ్డి, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు గడ్డం రాంరెడ్డి, నాయకులు మాదం నడ్పిరాజం, రేగుంట రాజు, రాజేశ్వర్ పాల్గొన్నారు.