కోరుట్ల, ఆగస్ట్ 8 : జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. పట్టణంలోని 9వవార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ పోగుల ఉమారాణి భర్త లక్ష్మీరాజం దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం ఉదయం ఓ హోటల్లో టీ తాగేందుకు వచ్చిన అతడిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను దవాఖానకు తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో హత్య జరగడం పట్టణంలో సంచలనం సృష్టించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీరాజం పట్టణంలోని కార్గిల్ చౌరస్తా సమీపంలో పూరి గుడిసెలో ఉన్న హోటల్ వద్దకు మంగళవారం ఉదయం టీ తాగేందుకు వచ్చాడు. ఈ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి హోటల్ ఎదుట ఆగారు. ఓ వ్యక్తి బైక్ దిగి నేరుగా లక్ష్మీరాజం దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతున్న ఆయన సదరు వ్యక్తిని గుర్తించి ‘నాగరాజు బాగున్నావా’ అని అడిగాడు. ఇంతలో వెంట తెచ్చుకున్న కత్తితో ఆ వ్యక్తి లక్ష్మీరాజంపై దాడి చేశాడు. మెడ భాగంలో కత్తితో పొడవడంతో కుప్పకూలిపోయాడు. పక్కనే చాయ్ తాగేందుకు వచ్చిన వారు, హోటల్ నిర్వాహకులు దుండగుడిని ఆడ్డుకునే యత్నం చేయగా.. కత్తిని గాల్లో ఊపుతూ బెదిరించడంతో వారు భయంతో పక్కకు వెళ్లారు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మీరాజంను స్థానికులు అంబులెన్స్లో ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యుల సూచనల మేరకు కరీంనగర్కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించాడు. కాగా, ఇటీవల జరిగిన ఓ వ్యక్తి హత్య వెనుక లక్ష్మీరాజం హస్తం ఉందనే అనుమానంతో పట్టణానికి చెందిన నాగరాజు, త్రిమూర్తి, వంశీ, సత్యనారాయణ ఈ ఘాతుకానికి ఒడిగట్టారని మృతుడి బంధువులు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ కిరణ్కుమార్ తెలిపారు. మృతుడి భార్య ఉమారాణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీరాజంకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
లక్ష్మీరాజం వెన్నంటి ఉన్న సంజయ్..
లక్ష్మీరాజంపై దాడి చేసిన విషయం తెలియగానే బీఆర్ఎస్ రాష్ట్ర నేత కల్వకుంట్ల సంజయ్ వెంటనే కోరుట్లకు చేరుకున్నారు. కత్తిపోట్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డ లక్ష్మీరాజంతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నేత డాక్టర్ అనూప్రావుతో కలిసి అంబులెన్స్లో కరీంనగర్ వరకు వెళ్లారు. లక్ష్మీరాజం కన్నుమూయడంతో సంజయ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. లక్ష్మీరాజం పార్థివ దేహానికి ఘన నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీ అంకితభావంతో పని చేసిన మంచి వ్యక్తిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.
దవాఖాన వద్ద తీవ్ర ఉద్రిక్తత..
పోస్ట్మార్టం కోసం కోరుట్ల దవాఖానకు లక్ష్మీరాజం మృతదేహాన్ని తీసుకురావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని దవాఖాన ఎదుట బైఠాయించారు. మెట్పల్లి డీఎస్పీ రవీందర్రెడ్డి, కోరుట్ల, మెట్పల్లి సీఐలు ప్రవీణ్కుమార్, లక్ష్మీనారాయణ ఘటనాస్థలిని పరిశీలించారు.
లక్ష్మీరాజం మృతి కలిచి వేసింది : ఎమ్మెల్యే
కోరుట్లకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు పోగుల లక్ష్మీరాజం హత్య కలిచి వేసిందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్నారు. ఆయన మరణం పార్టీకి తీరనిలోటని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చురుకైన కార్యకర్తని, పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశాడని కొనియాడారు. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం
చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ ఎగ్గిడి భాస్కర్ హెచ్చరించారు. కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా సమీపంలో ఓ హోటల్లో మంగళవారం బీఆర్ఎస్ నాయకుడు పోగుల లక్ష్మీరాజం హత్యకు గురికాగా, ఆ ప్రదేశాన్ని మెట్పల్లి డీఎస్పీ రవీందర్రెడ్డితో కలిసి ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా హత్య జరిగిన తీరుతెన్నులపై ఆరా తీశారు. ఇద్దరు నిందితులను గుర్తించినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానితులైన నాగరాజు, త్రిమూర్తి, వంశీ, సత్యనారాయణను త్వరలోనే పట్టుకుంటామన్నారు. హత్య జరిగిన ప్రదేశంలో టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ టీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఇక్కడ కోరుట్ల సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐలు సతీష్, శ్యాంరాజ్ ఉన్నారు.
లక్ష్మీరాజం మృతికి మంత్రి కేటీఆర్ సంతాపం
కోరుట్ల, అగస్ట్ 8 : పట్టణానికి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ పోగుల ఉమారాణి భర్త పోగుల లక్ష్మీరాజం మృతిపై రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి కేటీ ఆర్.. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల సంజయ్కు మంగళవారం సాయంత్రం ఫోన్ చేశారు. హత్యకు గల కారణాలను తెలుసు కున్న మంత్రి.. ఉమారాణి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ధైర్యాన్ని కోల్పోవద్దని భరోసా కల్పించారు. హత్యకు పాల్పడిన నిందితులను త్వరగా పట్టుకొని వారికి తగిన శిక్ష పడేలా చూస్తా మని హామీ ఇచ్చారు.