కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 11 : కరీంనగర్లో మంగళవారం నిర్వహించే బీఆర్ఎస్ కరీంనగర్ కదనభేరి సభకు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో సభా ఏర్పాట్లను పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్తో కలిసి ఆయన పరిశీలించారు. అంతకుముందు ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో సింహగర్జన సభతోనే మొదలుపెట్టారని గుర్తు చేశారు. కరీంనగర్లో ఏది మొదలు పెట్టినా విజయవంతం అవుతుందున్న సెంటిమెంట్తోనే పార్లమెంట్ ఎన్నికలకు కేసీఆర్ శంఖారావం పూరిస్తున్నారని చెప్పారు.
కేసీఆర్ పాలనలో కాళేశ్వరం జలాలతో భూమికి బరువు అయ్యేంత పంటను రైతులు పండించారని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు పొలాలు నెర్రెలు బారుతున్నాయని ఆవేదన చెందారు. రైతులకు బీఆర్ఎస్ ఎప్పటికీ అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో బీఆర్ఎస్ గొంతు ఉండడం ఎంతో అవసరమని చెప్పారు. ఎంపీగా వినోద్కుమార్ కరీంనగర్కు స్మార్ట్సిటీతోపాటు రైల్వే లైన్లు, జాతీయ రహదారులు తీసుకురావడంలో ఎంతో కృషి చేశారన్నారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ అవసరం ఎంత ఉంటుందో కేసీఆర్ ప్రజలకు వివరిస్తారని పేర్కొన్నారు.
తెలంగాణ సోయి ఉన్న వారే ఎంపీలుగా ఉండాలని, అప్పుడే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడవచ్చని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మొదటి సభను కరీంనగర్ నుంచే కేసీఆర్ ప్రారంభిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున పార్లమెంట్లో తప్పనిసరిగా బీఆర్ఎస్ ఉండాల్సిన ఆవశ్యకత ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్ర ఉద్యమంలోనూ, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వివిధ అంశాలపై బీఆర్ఎస్ ఎంపీలు ఏస్థాయిలో పోరాడారో ప్రజలు చూస్తున్నారని తెలిపారు.
మేడిగడ్డ వద్ద మూడు పిల్లర్లలో సమస్యలు వస్తే ఇప్పటికి మూడు నెలలు అవుతున్నా సమస్య ఎక్కడ వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించలేకపోయిందని విమర్శించారు. పంట పొలాలకు నీరందక రైతులు తమ పొలాలను అగ్నికి ఆహుతి చేస్తున్నారని, ఇది ఎంతో బాధను కలిగిస్తుందన్నారు. అదే కేసీఆర్ సీఎం అయి ఉంటే ఇప్పటికే ఆ మూడు పిల్లర్ల వద్ద కాపర్డ్యాం నిర్మించి అక్కడి నుంచి నీటిని ఎత్తిపోసి మధ్యమానేరు, ఎల్ఎండీల ద్వారా రైతులకు సాగునీరు అందించే వారని తెలిపారు. ఇప్పటికే రైతులు కూడా కేసీఆర్ ఉండి ఉంటే ఎలాగైనా సాగునీరు అందించే వారని అనుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ 90 రోజుల్లో గోదావరి నుంచి ప్రతి రోజూ 5 వేల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలిసిందన్నారు. తెలంగాణ గుండె, మనసుతో చూస్తేనే ఇక్కడి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.
కేసీఆర్ పాలనలో పండిన పంటను కోసేందుకు మిషన్లు దొరకని పరిస్థితి ఉంటే ఇప్పుడు మాత్రం పంట పొలాలకు నీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. కేసీఆర్ మళ్లీ రావాలని, పార్లమెంట్లో బీఆర్ఎస్ గొంతు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కరీంనగర్ కదనభేరి సభకు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, రైతులు, అభిమానాలు, కార్యకర్తలు తరలి వస్తున్నారని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ యాదగిరి సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు లోక బాపురెడ్డి, పొన్నం అనిల్కుమార్, భూక్యా తిరుపతినాయక్ పాల్గొన్నారు.
– మాజీ ఎంపీ వినోద్కుమార్