కరీంనగర్, కలెక్టరేట్, ఏప్రిల్ 19 : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రెండో రోజు నామినేషన్లు జోరుగా దాఖలయ్యాయి. పెద్దపల్లిలో ముగ్గురు, కరీంనగర్లో ఒకరు, నిజామాబాద్లో ఏడుగురు నామినేషన్లు వేశారు. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ తరఫున పార్టీ నాయకులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
పెద్దపల్లిలో బీఆర్ఎస్ తరఫున కొప్పుల ఈశ్వర్(రెండు సెట్లు), కాంగ్రెస్ తరఫున గడ్డం వంశీ కృష్ణ (రెండు సెట్లు), బీఆర్ఎస్ తరఫున కొంకటి లింగమూర్తి (ఒక సెట్) నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. నిజామాబాద్లో ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాగా, బీఆర్ఎస్ తరఫున బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ దాఖలు చేశారు.