గన్నేరువరం, నవంబర్ 14 : “కాంగ్రెస్ మాయలో పడి ప్రజలు ఆగం కావద్దు.. ఆ పార్టీకి ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకోవడమే.. 24 గంటలు కరెంటిచ్చే బీఆర్ఎస్ కావాలా..? 3 గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ కావాలా..? రైతులే తేల్చుకోవాలి” అని మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం గన్నేరువరం మండలంలోని పీచుపల్లి, చొకరావుపల్లి, చాకలివానిపల్లి, మైలారం, హన్మాజిపల్లి గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో కరెంటు, సాగునీరు, తాగునీటి కోసం అరిగోస పడ్డామని గుర్తు చేశారు. రైతులపై కాంగ్రెస్ విషం కకుతుందని, రైతుబంధు, రుణమాఫీ ఆపాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిందని మండిపడ్డారు. 60 ఏండ్ల పాలనలో అభివృద్ధి చేయనోళ్లు ఇప్పుడు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే కవ్వంపల్లి వస్తున్నాడని, కరోనా సమయంలో ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని అంశాలను వివరించారు. అభివృద్ధి చేసిన తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్తో పాటు కాంగ్రెస్, బీజేపీ నాయకులు, మఠానికి చెందిన 200 మంది బీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రవీందర్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు వెంకన్న, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.