‘రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేద్దాం. కరీంనగర్లో బోయినపల్లి వినోదన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. ఇక్కడి నుంచే పార్టీ అధినేత పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తరు. ఈ నెల 12న కరీంనగర్లో నిర్వహించే కదనభేరిని విజయవంతం చేద్దాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం వేర్వేరుగా నిర్వహించిన ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాల బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
కేసీఆర్ విలువేందో ఏప్రిల్, మేలో తెలుస్తది
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మల్లన్నసాగర్ ద్వారా కూడెల్లి వాగు, నర్మాల ప్రాజెక్టు నింపి అన్ని గ్రామాలకు కాళేశ్వరం జలాలు అందించాం. ఈ సారి నీళ్ల సంగతేంటని కాళేశ్వరం సీఈని అడిగితే.. ఏప్రిల్, మేలో కేసీఆర్ విలువేందో తెలుస్తదని, మీరు యాదిపెట్టుకోండని సమాధానం ఇచ్చిండు. ఆయన పేరు చెబితే కాంగ్రెస్ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. బాధ్యతలను తప్పిస్తుంది. అయినా యాభై ఏండ్లు అధికారంలో ఉన్నా అప్పర్మానేరు నింపనిది ఇదే కాంగ్రెస్ సన్నాసులు కదా..? ఇయ్యాళ వాళ్లే పోయి పాలాభిషేకాలు చేస్తున్నరు. మందికి పుట్టిన బిడ్డలు తమ బిడ్డలని చెప్పుకునేందుకు కొంచమైనా సిగ్గు, ఇజ్జత్ ఉండాలి.
– కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, మార్చి 5 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల రూరల్/ ముస్తాబాద్ : ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మొదటి పరీక్ష పార్లమెంట్ ఎన్నికలని, ఈ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిస్లిల ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉద్యమంలో మనతో కలిసి పనిచేసిన విద్యావంతుడు, ఢిల్లీలో పెద్ద పెద్ద లీడర్ల మెడలు వంచే సత్తా ఉన్న నాయకుడు బోయినపల్లి వినోద్కుమార్ను 50వేల భారీ మెజార్టీతో గెలిపించుకుందామని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత తనదేనని, మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని కార్యకర్తలకు భరోసానిచ్చారు. ఎల్ఆర్ఎస్ అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిర్వహించే పార్టీ ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, అలాగే ఈ నెల 12న ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టే కదనభేరి సభకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి తనమీద కోపంతోని సిరిసిల్ల నేతన్నల కొంపముంచే ప్రయత్నం చేస్తున్నాడని, కేసీఆర్ మీద కోపంతోని కాళేశ్వరం ప్రాజెక్టు దండగంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. పద్మశాలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేకే మహేందర్రెడ్డితో నేతన్నలకు క్షమాపణ చెప్పించాలని, బతుకమ్మ చీరెల ఆర్డర్లు సిరిసిల్ల వేదికగా ప్రకటించాలని, బతుకమ్మ చీరెల పాత బకాయిలు విడుదల చేయాలని, మల్కపేట రిజర్వాయర్ను ప్రారంభించి సాగునీరందించాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ గుండెళ్లో రైళ్లు పరుగెత్తించి వంద కిలోమీటర్ల స్పీడ్తో కారును ఉరికించామని, ప్రజల దయతో అధికారంలోకి వచ్చి పదేండ్ల పాటు పనిచేశామని కేటీఆర్ గుర్తు చేశారు. కారు సర్వీసింగ్కు పోయి వచ్చిందని, పార్లమెంటు ఎన్నికల్లో రోడ్డెక్కితే మళ్లీ వంద కిలోమీటర్ల స్పీడుతో ఉరికించే శక్తి, సత్తా కార్యకర్తలకే ఉందన్నారు. ఏదో జరిగిపోయిందన్న బాధలో ఉండకూడదని, కేసీఆర్ లేకుంటే జీర్ణించుకోలేమంటూ ప్రజలంతా బాధపడుతున్నారని చెప్పారు. ఇదోరకంగా మన మంచికే జరిగిందని, మనమీదున్న దిష్టికూడా పోయిందని చెప్పారు. కేసీఆర్ విలువేంటో తెలిసి రావాలంటే ఇలాంటి సన్నాసుల పాలన ఉంటేనే ఒక సమర్థుడి పాలనేంటో, ఆయన విలువేంటో తెలుస్తుందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు పత్రాలు ఇస్తూ తానే ఉద్యోగాలిచ్చినట్టు చెప్పుకుంటున్న సిగ్గులేని, దగుల్భాజీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆయనో ముఖ్యమంత్రి? ఆయన కింద పనిచేసే సన్నాసులు వేరే తీరుగా ఎందుకుంటరు? అని, ముస్తాబాద్, సిరిసిల్లలో ఉండే కాంగ్రెస్ సన్నాసులు గట్లనే ఉంటరని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అటు నేతన్నలు, రైతన్నలను ఆదుకున్నామని, సిరిసిల్ల, గర్శకుర్తిలోని నేత కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి పొట్టకు, బట్టకు లోటు లేకుండా చేశామని గుర్తు చేశారు. పొరపాటున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక అన్ని క్యాన్సిల్ చేస్తున్నదని ధ్వజమెత్తారు. మంజూరైన దుబ్బా క, ముస్తాబాద్ రోడ్డును కూడా క్యాన్సిల్ చేసినట్టే బతుకమ్మ చీరలను క్యాన్సిల్ చేస్తారేమోనని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు సిరిసిల్ల నేతన్నల పొట్టగొట్టద్దని విజ్ఞప్తి చేశానని తెలిపారు. కాంగ్రెస్ నాయకులకు చేతనైతే రోడ్లు రద్దుచేసుడు కాదని, ప్రజల మనసు గెలుచుకోవాలంటే రెండు రోడ్లను నాలుగు లైన్లు చెయ్యాలని సవాల్ చేశారు.
ప్రపంచంలోని అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం అని కేటీఆర్ చెప్పారు. దీని విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి సీఎం రేవంత్ నుంచి గల్లీ లీడర్ల వరకు నోటికొచ్చిన్నట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంతో సగం తెలంగాణకు సంబంధం ఉందని, 40లక్షల ఎకరాలకు సాగు రైతులకు సంబంధముందన్నారు. అసలు కాళేశ్వరం అంటే మూడు బరాజ్ లు (మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్), 15 రిజర్వాయర్లు, 21 పంప్హౌస్లు, 19 సబ్స్టేషన్లు, 270 కిలోమీటర్ల సొరంగమార్గాలు మార్గాలని చెప్పారు. మేడిగడ్డ పిల్లర్లలో ఒక్క పిల్లర్ కుంగితే మొత్తం లక్ష కోట్లు నాశనయ్యాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇయాళ రోజుకు 5వేల క్యూసెక్కుల గోదావరి నీళ్లు సముద్రంలోకి వృథాగా పోతుంటే సీఎం రేవంత్రెడ్డి కండ్లప్పగించి చూస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు కేసీఆర్ ఉంటే వెంటనే తగు చర్యలు చేపట్టి మరమ్మతులు చేయించేవారని, సాగునీరందించే వారని చెప్పారు. కానీ, రేవంత్ కేసీఆర్ మీద ఉన్న కోపాన్ని రైతుల మీద చూపిస్తున్నాడని మండిపడ్డారు. వానకాలం రాకముందే మరమ్మతులు చేసి నీళ్లివ్వాలని అంటే పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరమ్మతులు చేయకుండా, రైతులకు నీ ళ్లు ఇయ్యకుండా కేసీఆర్ను బద్నాం చెయ్యాలని ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని విమర్శించారు. ఈ మాటలు తాను బాధతో అంటున్నానని, తనపై కేసులు పెట్టినా భయపడేది లేదని, దేనికైనా సిద్ధమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇక్కడి కాంగ్రెస్ నేతకు కళ్లు నెత్తికెక్కినయి సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి ఒక కాంగ్రెస్ నాయకుడు ఉన్నడు. నాపై నాలుగు సార్లు ఓడిపోయిండు. వాళ్ల పార్టీ అధికారంలోకి రాగానే కండ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నడు. నిన్నాగాక మొన్న ఓ పద్మశాలి సోదరుడు బతుకమ్మ చీరల ఆర్డరు లేక తన ఆవేదనతో కూడిన సెల్ఫీ వీడియో పెడ్తే.. దాని గురించి వార్త రాసిన విలేకరిని బెదిరిస్తున్నడు. పాపడాలు, నిరోధ్లు ఎంత మంది అమ్ముతున్నరు? బతుకమ్మ చీరలతో ఆరేండ్లు దొబ్బి తినలేదా..? అని మాట్లాడిండు. నేతన్నలను, పద్మశాలీ సామాజిక వర్గాన్ని అవమానించిండు. బలుపెక్కిన మాటలా అవి? ఓవైపు రేవంత్రెడ్డి కేసీఆర్ మీద కోపం రైతుల మీద తీసకుంటున్నడు. తనకు పద్మశాలీలు ఓట్లేయలేదని బతుకమ్మ చీరల ఆర్డర్లు రద్దు చేసి.. పాపడాలు, నిరోధ్లు అమ్ముకునే స్థాయిలో ఉన్నారని ఈయన నీచంగా మాట్లాడిండు. అసలు మనిషి అనేటోడు ఇలా మాట్లాడతాడా..? ఒక నాయకుడిగా నీకు ఇంగిత జ్ఞానం ఉందా..? నేతన్నలను అవమానించిన మహేందర్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాతే సీఎం రేవంత్రెడ్డి సిరిసిల్లకు రావాలి.
– కేటీఆర్
ప్రజలను మోసం చేసి 420 లంగ హామీలు, దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి రూ.రెండు లక్షల లోను తెచ్చుకోండి, డిసెంబర్ 9న రుణమాఫీపై సంతకం పెడుతానని మోసం చేయలేదా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎవరు చెప్పమన్నాడు? ఎవరు నరకమన్నాడు? కేసీఆర్ రూ.పదివేలు బిచ్చం వేసినట్లు వేస్తుండని రూ.15 వేలు రైతుబంధు ఇస్తానన్నడు? ఇప్పటి వరకు జాడలేదన్నారు. రైతులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ మోసపోయామని బాధపడుతున్నారన్నారు. కరెంటు కోతలు, లోవోల్టేజీ సమస్యలు మొదలై రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్పై ఇప్పటికే ప్రజల్లో మొహం కొట్టిందని పేర్కొన్నారు.
‘మోదీ ప్రధాన మంత్రిగా ఉండి తెలంగాణకు ఏమిచ్చిండు? తెలంగాణ ప్రజలకు ఒక్కటైనా పనికొచ్చే పనిచేసిండా..? తెలంగాణలోని గిరిజనులు, రైతన్నలు, విద్యార్థులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేండ్లలో చేసిందేంటి? సాధించిందేంటి? రామ మందిరం పేరు చెప్పి, రాముడిని అడ్డం పెట్టుకొని మళ్లీ ఒక్కసారి ఓట్లు దండుకునే చిల్లర ఆలోచన చేస్తున్నరు’ కేటీఆర్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వంద అంకాల్లో మేడిగడ్డ ఒకటని, మేడిగడ్డ 86 పిల్లర్లలో ఒకటి రెండింటిలో సమస్య వచ్చిందని తెలిపారు. వానకాలం వరకు రిపేర్లు చేయకుండా వదిలిపెడితే మొత్తం బ్యారేజీ డ్యామేజ్ అవుతుందన్న చెత్త ఆలోచనతోని ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. కేసీఆర్, బీఆర్ఎస్ మీదున్న కోపాన్ని రైతుల మీద తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. తాము, ఎమ్మెల్యేలు, కార్యకర్తలంతా కలిసి మేడిగడ్డను పరిశీలిస్తే సమస్య అంత తీవ్రంగా లేదని తెలిసిందని, ఒక్క పిల్లర్లోనే కొంత సమస్య ఏర్పడిందని తెలిపారు.
కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ చేసిందేమిటని కేటీఆర్ నిలదీశారు. పార్లమెంటులో జిల్లాకు విద్యాసంస్థ కావాలే, మెడికల్ కళాశాల కావాలే, నేషనల్ హైవే కావాలె, రైల్వే లైన్ కావాలె అని అడిగేటోళ్లు ఎంపీగా పనిచేస్తారని చెప్పారు. చేతనైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చి ఈప్రాంత రైతులకు మేలు చేసే పనిచెయ్యాలని బండికి సవాల్ విసిరారు. ఐదేళ్లు ఏం చేశావని, సిరిసిల్ల నేతన్నలకు మెగా పవర్లూం క్లస్టర్ తెచ్చావా? అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధిగా నీవు చెయ్యాల్సిన పని చెయ్యకుండా సన్నాసి మాటలు మాట్లాడుకుంటా ప్రజాసంకల్ప యాత్ర చేపట్టడం సిగ్గుచేటన్నారు. మాట్లాడితే ఆయ నోటి వెంట హిందువా? ముస్లింవా? మసీదా? మందిరమా? అనే మాటలు తప్ప ఇంకో మాటే రాదని ఎద్దేవా చేశారు. మతం పేరుమీద పోరగాండ్ల నెత్తులు చెడగొట్టుడు, మతం పేరుమీద కత్తులు దూసుడు తప్ప సంజయ్ అనే సన్నాసి చేసిందేమిటని ప్రశ్నించారు. పదేండ్ల మోదీ ప్రభుత్వంలో ఐదేండ్లు వినోద్ కుమార్ కరీంనగర్ ఎంపీగా పనిచేశారని, తర్వాత ఐదేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఉన్నారని, ఆ ఇద్దరిలో ఎవరు పనిచేశారో? ముస్తాబాద్, సిరిసిల్ల, కరీంనగర్లో ఎక్కడైనా సరే చర్చకు రావాలని సవాల్ చేశారు. అభివృద్ధిపై ప్రజల కోసం ఎవరు కొట్లాడారో తేల్చుకుందామన్నారు. ఈ సమావేశాల్లో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ప్రవీణ్, మండల శాఖల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కరీంనగర్ ఎంపీగా వినోద్కుమార్ను గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉన్నది. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ పరిధిలో ఎంతో అభివృద్ధి చెందింది. గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాన్ని పునరావృతం చేసుకోవద్దు. కులం, మతం పేరిట బీజేపీ తగాదాలు సృష్టించి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నది. బండి సంజయ్ గత ఐదేండ్లలో ఎన్ని ఫండ్స్ తీసుకువచ్చారో.. ఎంత అభివృద్ధి చేశారో.. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంట్, నీటి సమస్యలు మొదలైనయ్. కార్యకర్తలంతా సమష్టిగా వినోద్కుమార్ గెలుపు కోసం పనిచేయాలి.
– కొండూరి రవీందర్రావు, నాఫ్స్కాబ్ చైర్మన్
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్కు మద్దతునివ్వాలి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రజలంతా బాధపడుతున్నరు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడంతో ఆవేదన చెందుతున్నరు. కేటీఆర్ దిశానిర్దేశంతో కార్యకర్తల్లో జోష్ వచ్చింది. ప్రతి కార్యకర్తా బాధ్యతగా పనిచేసి వినోద్కుమార్ను గెలిపించాలి. ఈ నెల 12న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించే పార్లమెంట్ ఎన్నికల శంఖారావ సభకు కార్యకర్తలంతా తరలిరావాలి.
– తోట ఆగయ్య, బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు
కేటీఆర్ ఇక్కడ ప్రాతనిధ్యం వహించడం సిరిసిల్ల ప్రజల అదృష్టం. గొప్ప నాయకుడు కేటీఆర్. మంత్రిగా ఈ ప్రాంతాన్ని ఆదర్శంగా చేసిండు. కరీంనగర్ ఎంపీగా వినోద్కుమార్ను తప్పకుండా గెలిపించుకోవాలి. మంచి ఉన్నతమైన వ్యక్తి. తెలంగాణ అభివృద్ధికి కృషి చేసిండు. కాంగ్రెస్ మోసపూరితమైన హామీలు, ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసింది. కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలి. అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి. వినోద్కుమార్ గెలుపు కోసం కృషి చేయాలి. నేను కూడా వినోద్ అన్న గెలుపు కోసం ప్రచారం చేస్త.
– కోవ లక్ష్మి, ఎమ్మెల్యే (ఆసిఫాబాద్)