కోరుట్ల రూరల్/కోరుట్ల, ఆగస్టు 2 : బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల సవాళ్లతో ఒకసారిగా కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెకింది. యూరియా పంపిణీలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. దీంతో కోరుట్ల మండలంలోని అయిలాపూర్లో గల రైతు వేదిక వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. నిజయోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో రైతువేదిక వద్దకు చేరుకొని చర్చలో పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు.
దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకున్నది. అనంతరం పోలీసులు ఇరువర్గాల నాయకులకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. గ్రామంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహనికి వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మట్లాడుతూ, రైతులు రెండు యూరియా బస్తాలకో జింక్ బస్తాను కొనాలనే నిబంధనను కాంగ్రెస్ ప్రభుత్వం విధించడం సమంజసం కాదన్నారు. నియోజకవర్గంలో ఎంతమంది రైతులకు యూరియా బస్తాలు ఇచ్చారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎసీఎస్ కేంద్రాల్లో రైతులకు సరిపడా యూరియా బస్తాలు లేవన్నారు. ఈ విషయమై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, పోలీసులను అడ్డుపెట్టుకుని తమ నాయకులను అక్రమంగా మా అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకుల సవాల్ స్వీకరించిన బీఆర్ఎస్ నాయకులు అయిలాపూర్ వేదిక వద్ద నిర్వహించే బహిరంగ చర్చకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. మాదాపూర్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కథలాపూర్ పోలీస్స్టేషన్కు తరలించారు. కోరుట్లకు చెందిన పలువురు నాయకులను ఆరెస్ట్ చేశారు.
సుమారు మూడు గంటలపాటు బీఆర్ఎస్ నాయకులను అదుపులో ఉంచుకున్న పోలీసులు వ్యకిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అదేవిధంగా మెట్పల్లి నుంచి ఐలాపూర్కు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులను పట్టణంలోని వట్టివాగు వద్ద 63వ జాతీయ రహదారిపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని మండిపడ్డారు. ప్రశ్నించే వారిపై ఉక్కుపాదం మోపుతుందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఉద్యమాల పార్టీ అని.. అరెస్టులు, నిర్బంధాలకు భయపడమని స్పష్టం చేశారు.