మానకొండూర్ రూరల్, నవంబర్ 18: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 20న తిమ్మాపూర్ మండలంలో జరుగనున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పార్టీ శ్రేణులకు సూచించారు. శనివారం తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మానకొండూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి జడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ మండలాధ్యక్షులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేయాలన్నారు. మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని శంకరపట్నం, గన్నేరువరం, ఇల్లంతకుంట, మానకొండూర్, తిమ్మాపూర్, బెజ్జంకి మండలాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చేలా చూడాలని ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచులు, నాయకులకు వినోద్ కుమార్ సూచించారు. సమావేశంలో జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సర్పంచులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.