ఇల్లందకుంట మండలం చిన్నకోమటిపల్లి గ్రామస్తులు బీఆర్ఎస్కు జైకొట్టారు. 500 మంది గురువారం గులాబీ పార్టీలో చేరగా, హుజూరాబాద్లోని సాయి కన్వెన్షన్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డితో కలిసి వారందరికీ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్లోకి వచ్చిన వారిలో బీజేపీ నుంచి ఎక్కువ మంది ఉండగా, ఇందులో పెద్ద ఎత్తున ముదిరాజ్ కులస్తులు ఉన్నారు.
-హుజూరాబాద్, అక్టోబర్ 26
హుజూరాబాద్/ టౌన్, అక్టోబర్ 26 : కాంగ్రెస్కు తప్పిపోయి ఓటు వేస్తే మళ్ళీ ఆగమైపోతామని, వాళ్ల చేతిలో రాష్ర్టాన్ని పెడితే కుక్కలు చింపిన విస్తరి చేస్తారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, బీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు. గురువారం రాత్రి హుజూరాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని, ప్రజలందరికీ ప్రగతి ఫలాలు అందాలంటే మూడోసారి కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే కరెంటు తీగలపై బట్టలారేసుకోవాలి తప్ప కరెంటు ఉండదని గత కాంగ్రెస్ పాలకులు ఎద్దేవా చేసింది ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 24 గంటల కరెంటు అందిస్తూ యావత్ రాష్ట్ర ప్రజలకు కరెంట్ కష్టం లేకుండా చేసిందన్నారు.
ప్రపంచంలోనే ఎకడా లేని విధంగా సీఎం కేసీఆర్ పేదలందరికీ ఎల్ఐసీ బీమా సౌకర్యం కల్పించబోతున్నట్లు చెప్పారు. ఒకప్పుడు తెలంగాణలో మూడు కాలేజీలు ఉండి వెయ్యి ఎంబీబీఎస్ సీట్లు ఉంటే, ఇప్పుడు 35 మెడికల్ కాలేజీలకు పెంచుకొని ఏడాదికి పది వేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టోను చూస్తే ప్రతిపక్షాలకు ఏం మాట్లాడాలో పాలుపోక నోటికి వచ్చినట్లు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రజల్లో చులకన అవుతున్నారని ఎద్దేవా చేశారు. ఐదు లక్షల ఆరోగ్యశ్రీని రూ.15 లక్షలకు పెంచామని, తెలంగాణలోని 93 లక్షల కుటుంబాల తెల్ల రేషన్ కార్డుదారులకు ఇంటింటికీ సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు రూ.3వేలు, ఒకో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అందించ బోతున్నామన్నారు.
ఇప్పటికే 20 ఏళ్లపాటు సరిపోయేలా కరెంటు ఉత్పత్తిని పెంచామని, అవసరమైనన్ని ప్రాజెక్టుల నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇక ముందు రాష్ట్ర బడ్జెట్పై సూక్ష్మ ప్రణాళికతో ముందుకు సాగుతూ రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి కోసం ప్రతి పైసా ప్రతి కుటుంబానికి ఖర్చు చేస్తామని తెలిపారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి సంపదను పెంచేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. తెలంగాణలో జరుగుతున్న అద్భుత ప్రగతి, అభివృద్ధి పథకాలకు ప్రపంచమే అబ్బుర పడుతుందన్నారు.
రైతు బంధు నిలిపివేయాలని చేసిన ఫిర్యాదును కాంగ్రెస్ బే షరతుగా వాపస్ తీసుకుని రైతులకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఓట్లు అడగాలని కోరారు. కాంగ్రెస్కు ఓటేస్తే ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ మాత్రమే ఇస్తానని చెబుతున్నాడని, దీనికి ప్రత్యక్ష ఉదాహరణే కర్నాటకలో 5 గంటలు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్కు ఓటేస్తే రైతులందరూ టార్చిలైటు కొనుక్కునే దరిద్రపు రోజులు వస్తాయని చెప్పారు. ప్రజలారా సంక్షేమం గురించి తపించే బీఆర్ఎస్ కావాలా..? కాళ్ళల్లో కట్టె పెట్టే కాంగ్రెప్ కావాలో ఆలోచన చేయాలని సూచించారు.
ఇల్లందకుంట మండలం చిన్నకోమటిపల్లి గ్రామం బీఆర్ఎస్కు జై కొట్టింది. అక్కడి నుంచి 500 మంది గ్రామస్తులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పట్టణంలోని సాయి కన్వెన్షన్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో బీజేపీ నుంచి ఎక్కువ మంది ఉండగా ఇందులో పెద్ద ఎత్తున ముదిరాజ్ కులస్థులు ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపిస్తారన్న నమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిలి రమేశ్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, నాయకులు వడ్లూరి విజయ్కుమార్, గందె శ్రీనివాస్, వర్ధినేని రవీందర్రావు, నాయినేని తిరుపతిరావు, తాళ్లపెల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.