వేములవాడ, అక్టోబర్ 19: మూడు గంటలే కరెంటు చాలంటున్న రేవంత్రెడ్డి మాటలు వింటుంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టార్చ్లైట్ కొనుకునే పరిస్థితి వస్తుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని 11వ వార్డులో వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావుతో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొని అనంతరం ఆత్మీయ సభలో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ 2009లో ప్రకటించి ఎందుకు వెనకి తీసుకుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలోని 32పార్టీలతో మాట్లాడి 28పార్టీలను ఒప్పించి తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆ రోజు ఒక నాయకుడు మాట్లాడలేదు కానీ ఈ రోజు మాత్రం తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బొగ్గు మనది నీళ్లు మనది కరెంట్ మాత్రం ఆంధ్రుల చేతుల్లో ఉండేదని, చివరకు తెలంగాణ ఏర్పడితే కరెంటు ఉండదని విమర్శించిన నాయకులకు ఈరోజు 24 గంటల విద్యుత్ ఇస్తూ తగిన బుద్ధి చెప్పిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి మూడు గంటల కరెంటు చాలని మాట్లాడడం ప్రజలు గమనించాలన్నారు.
చివరకు పేద ప్రజలకు ప్రభ్వుతం అందిస్తున్న సంక్షేమ పథకాలు కూడా ఒర్వలేని దుస్థితిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం అని ఓటు వాడికి గెలిచిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వేములవాడ పట్టణానికి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక రూపాయి కూడా తేలేదని విమర్శించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్కు 1000 కోట్ల రూపాయల నిధులు తెచ్చానని చెప్పారు. 23కోట్ల రూపాయలతో సిరిసిల్ల ఇంటర్నేషన్ డ్రైవింగ్ స్కూల్ను తెచ్చానన్నారు.
అన్ని విధాలుగా స్థిరపడి అనేక సేవా రంగాల్లో ఉన్న మన అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రెండుసార్లు ఆలయ చైర్మన్ గా ఉన్న ఆది శ్రీనివాస్ ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధిపై కట్టుబడి ఉందని ఇందులో భాగంగానే ఇప్పటికే 33 ఎకరాల స్థలం సేకరించడమే కాకుండా అభివృద్ధి కూడా నిధులు మంజూరు చేసి అంచలంచలుగా అభివృద్ధికి పాటుపడుతుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, పట్టణ పార్టీ అధ్యక్షులు పులం రాజు, రోసుల రవి, కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాస రావు, బింగి మహేశ్, అజయ్, గోలి మహేశ్, నాయకులు భాసర్ రావు, ప్రసాద్రావు, గడ్డం హన్మాండ్లు, శ్రీకాంత్గౌడ్, రామారావు, పీర్ మహ్మద్ తదితరులు ఉన్నారు.