‘ప్రజలకు కాంగ్రెస్ చేసిందేమీలేదు.. ఆ పార్టీకి అధికారం ఇస్తే రాష్ట్రం ఆగం అవుతుంది.. కుక్కలుచింపిన విస్తరిలా తయారవుతుంది.. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న సమయంలో సరైన నాయకుడికి అధికారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. కేసీఆర్ చేతుల్లో ఉంటేనే తెలంగాణ భద్రంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరుగుతున్న ఈ ఎన్నికలు చాలా ముఖ్యమని, ప్రజలు ఆలోచించి పనిచేసే వాళ్లకే ఓటేయాలని కోరారు.
సిరిసిల్ల టౌన్, నవంబర్ 11: కాంగ్రెస్కు అధికారం ఇస్తే రాష్ట్రం ఆగం అవుతుందని, కుక్కలు చింపిన విస్తరిలా తయారవుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న సమయంలో సరైన నాయకుడికి అధికారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. పైసల నోటుపోతే తిరిగి సంపాదించుకోవచ్చని, ఓటు పోతే తిరిగి సంపాదించుకోలేమని, ఆలోచించి పనిచేసే వాళ్లకే ఓటు వేయాలని సూచించారు. కేసీఆర్ చేతుల్లో ఉంటేనే తెలంగాణ భద్రంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని, మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. గతంలో బీఆర్ఎస్కు 80కిపైగా స్థానాలు వచ్చాయని, ఈ సారి వంద స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరుగుతున్న ఈ ఎన్నికలు చాలా ప్రాముఖ్య కలిగినవని చెప్పారు. రాష్ర్టాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. సాధించిన రాష్ర్టాన్ని తర్వాత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారన్నారు. ప్రస్తుతం మూడో సారి జరుగుతున్న ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడారు. గోదావరిపై ఎస్సారెస్పీ మాత్రమే కట్టిందని, ఎల్ఎండీ మినహాయిస్తే ఒక్క రిజర్వాయర్ నిర్మాణం చేపట్టలేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు మూడు బ్యారేజీలు, 20రిజర్వాయర్లు నిర్మించారని, దూరదృష్టి ఉన్న నాయకుడు ఉంటే ఇలాంటి అభివృద్ధి జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలు ఉంటే, అందులో రెండు స్వాతంత్రం రాకముందు ఏర్పడినవేనన్నారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసింది రెండే రెండు మెడికల్ కాలేజీలు అని తెలిపారు. కేసీఆర్ హయాంలో 35మెడికల్ కాలేజీలు నిర్మించగా, మారుమూల పట్టణాల్లోనూ 500 పడకల దవాఖానలు, మల్టీస్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారన్నారు. నాటి కాంగ్రెస్ సీఎం కిరణ్కుమార్రెడ్డి తెలంగాణ వస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకుంటరు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారని శాపనార్థాలు పెట్టారని గుర్తు చేశారు. నేడు రేవంత్రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని అంటున్నాడని, కాంగ్రెస్కు ఓటేస్తే రాత్రివేళ టార్చిలైట్ పట్టుకొని తిరగాల్సి వస్తుందేమోనన్నారు. అభివృద్ధిపై కనీ సం ఆలోచన లేని నాయకులు కాంగ్రెస్ పార్టీ వా రన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా కొంద రు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
కేసీఆర్ విదేశీ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో చదువుకొనే వారికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ పాలిస్తున్న రాష్ర్టాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని మోదీ, అమిత్షా, కిషన్రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ అంటున్నారని.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని, అందుకే కవిత అరెస్ట్ కాలేదని కాంగ్రెస్వాళ్లు అంటున్నారన్నారు. ఏ కుర్చీలో అయితే కవితను విచారణ చేశారో.. అక్కడే సోనియాగాంధీ, రాహుల్గాంధీని సైతం విచారణ చేశారని, వారిని అరెస్ట్ చేయలేదన్నారు. మరీ నేను కాంగ్రెస్, బీజేపీ ఒకటే.. అని అంటున్నానా.. అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ ఒజ్జల అగ్గిరాములు పాల్గొన్నారు.