వేములవాడ, నవంబర్ 14: రేవంత్ రెడ్డికి వ్యవసాయం గురించి తెలియని ఓ అజ్ఞాని అని, అయినా నీళ్లను ఎత్తిపోసేందుకు మోటర్లు ఏవి వాడుతారో తెలియకుండా మాట్లాడుతున్నాడని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. రైతన్న చేసే వ్యవసాయమే దండగ అన్న నారా చంద్రబాబునాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు. 10 హెచ్పీల మోటర్లు పెడితే మూడు గంటల విద్యుత్ సరిపోతుందని మాట్లాడడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. రైతులపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నాడని, అయినా రైతులెవరూ నమ్మరని స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని పండుగలా చేసి, అన్ని విధాలా ఆదుకున్న సీఎం కేసీఆర్కే మద్దతునిస్తారని చెప్పారు. వేములవాడలోని చల్మెడ నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన బూత్ కమిటీల ఇన్చార్జిలు, ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై, దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరించడంతోపాటు కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. రేవంత్రెడ్డి ఇంతకుముందు మూడు గంటల కరెంటే చాలని అన్నాడని, ఇప్పుడేమో 10 హెచ్పీ మోటర్లు వాడితే సరిపోతుందని అంటున్నాడని మండిపడ్డారు. అసలు వ్యవసాయం గురించి, రైతుల గురించి ఏమీ తెలియకుండా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. రాష్ట్ర విభజన జరిగిన రోజు మనకు 7778 మెగావాట్ల విద్యుత్ ఉండగా, సీఎం కేసీఆర్ పదేళ్లలో 28 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి నిరంతర విద్యుత్ను అందిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మూడు విడతలుగా పరిశ్రమలు నడుస్తున్నాయని, అందుకు సరిపడా విద్యుత్తును అందించడమే మన ప్రభుత్వం చేసిన పనితీరుకు నిదర్శనం అని గుర్తు చేశారు. సాగునీరు, 24గంటల విద్యుత్ అందడం, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో వెలుస్తున్న పరిశ్రమల ద్వారా కూడా ఉపాధి అవకాశాలు పెరిగాయని, తద్వారా ఈ రోజు గల్ఫ్ దేశాలకు వలసలు తగ్గాయని చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదని, మనమే కొట్లాడి తెచ్చుకున్నామని గుర్తు చేశారు.
నాడు రైతులను అరిగోసపెట్టి, ఇప్పుడు మళ్లీ మాయమాటలతో వస్తున్న కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ రోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో చేసిన అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్నదని, గడపగడపకూ వెళ్లి చర్చించి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి అనుమానాలను నివృత్తి చేసినప్పుడే మనకు ఓటు వేస్తారని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, ఆర్బీఎస్ పట్టణశాఖ అధ్యక్షుడు లైసెట్టి మల్లేశం, సహకార సంఘం అధ్యక్షుడు సల్మాన్ రెడ్డి, కౌన్సిలర్లు మారం కుమార్, నిమ్మశెట్టి విజయ్, జడల లక్ష్మి, కొండ పావని, జోగిని శంకర్, సిరిగిరి రాంచందర్, యాచమనేని శ్రీనివాసరావు, నరాల శేఖర్, ఇప్పపూల అజయ్, గోలి మహేశ్, కో ఆప్షన్ సభ్యులు కటూరు శ్రీనివాస్, బాబున్, నాయకులు రామతీర్థపు రాజు, పీచర భాసరరావు, ప్రసా ద్రావు, జడల శ్రీనివాస్, కొండ కనకయ్య, కొండ నర్సయ్య, ముద్రకోల వెంకటేశం, ముప్పిడి శ్రీనివాస్, గడ్డమీద శ్రీనివాస్, కం దుల క్రాంతి కుమార్, మాదాడి గజానంద రావు, గూడూరి మధు, నీలం శేఖర్, రామతీర్థపు హరీశ్, రాపెల్లి శ్రీధర్, గోపు బాలరాజు, గన్నమనేని రామారావు, రేణికింద అశోక్, పోతు అనిల్ కుమార్, పరశురాములు గౌడ్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, వెంకట్ రెడ్డి, కర్ల శేఖర్, సంజీవ్ తదితరులు ఉన్నారు.