రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ)/బోయినపల్లి/ గంగాధర : మధ్యమానేరు జలాశయం అడుగంటడానికి కాంగ్రెస్ వైఫల్యమే కారణమని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అడ్డగోలుగా ఉద్దెర మాటలు చెప్పి అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక అమలు చేయడానికి ఆగమవుతున్నదని ఆరోపించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకనవుతానని చెప్పారు. బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఉదయం కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి మార్నింగ్ వాక్ చేసి ప్రచారం చేశారు. అనంతరం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఆ తర్వాత బోయినపల్లి మండలం నుంచి సిరిసిల్లకు వెళ్తూ కొదురుపాక హైలెవల్ వంతన వద్ద శ్రీరాజరాజేశ్వర (మధ్యమానేరు) రిజర్వాయర్ను జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమతో కలిసి పరిశీలించారు. నీళ్లు లేక ఎండిపోయిన జలాశయాన్ని చూసి ఆవేదన చెందారు. సాయంత్రం కరీంనగర్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే గంగుల, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ సునీల్ రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ మండు వేసవిలో నీటితో కళకళ లాడాయని గుర్తు చేశారు. అటువంటి ప్రాజెక్టులన్నీ ఇప్పుడు చుక్క నీరు లేక బోసిపోయి రైతుల కళ్లల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయని ఆవేదనగా చెప్పారు. మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్లకు మరమ్మతు చేస్తే ఈ దుస్థితి వచ్చేది కాదని గుర్తు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పొలం బాటతో సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందన్నారు. ఇన్ని రోజులు నీళ్లు లేవని చెప్పి ప్రభుత్వం గాయత్రీ పంప్హౌస్ నుంచి నీటిని ఎలా విడుదల చేసిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలోనే కరీంనగర్లో అభివృద్ధి జరిగిందని, తనకు మరోసారి అవకాశం ఇస్తే మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. కరీంనగర్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని, యువతకు సిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయిస్తానని తెలిపారు.