కార్పొరేషన్, నవంబర్ 26: ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 90 సీట్లు గెలుచుకొని మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు 88 సీట్లు వచ్చాయని, ఈసారి 90 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు తెలంగాణకు చాలా కీలకమని పేర్కొన్నారు. పదేళ్లు తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు వ్యయం చేశామన్నారు.
కేసీఆర్ సీఎంగా ఉంటే తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నదన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు విపక్షాలను ఓడించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ నిర్వహిస్తున్న సభలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోందన్నారు. గతంలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చామని చెప్పుకొంటున్నదని, కాని ఆ పార్టీ తెలంగాణ ఇచ్చేలా తాము పోరాటం చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చామని చెబుతున్నా ప్రజలు నమ్మడం లేదన్నారు. ఉద్యమ సమయంలో రేవంత్రెడ్డి కరీంనగర్కు తుపాకీ పట్టుకొని వచ్చారని గుర్తు చేశారు.
ఎన్నికలకు ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మౌత్ టాక్ ద్వారా మార్పు కోరుకుంటున్నారంటూ గాసిప్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారని విమర్శించారు. ప్రజలు మాత్రం మార్పు కోరుకోవడం లేదన్నారు. సంక్షేమ పథకాలు చేపడుతున్న కేసీఆర్ను కాదని తమ నోట్లో ఎందుకు మట్టి పోసుకుంటామని ప్రజలే చెబుతున్నారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాలు అందిస్తున్నదని ప్రజలే గొప్పగా చెబుతున్నారని పేర్కొన్నారు. ఉపాధి కోసం వలసపోయిన వారు ఇప్పుడు గ్రామాలకు వచ్చి పనులు చేసుకుంటున్నారని, హైదరాబాద్లో ప్రైవేట్ సంస్థల్లో పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. 24 గంటలు నాణ్యమైన కరెంటు సరఫరా చేయడంతో పరిశ్రమలు మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నాయని, ఉత్పత్తి శక్తి పెరిగిందన్నారు.
ఇవన్ని చేస్తున్న కేసీఆర్ను ఎందుకు వదులుకుంటామని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ చేపట్టిన గాసిప్స్ను ప్రజలు నమ్మడం లేదన్నారు. పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు బీఆర్ఎస్కు మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటమి తప్పదన్నారు. బీజేపీ ఎప్పుడో చేతులు ఎత్తేసిందన్నారు. అనేక ప్రాంతాల్లో బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా రాదన్నారు. 60 స్థానాల్లో కాంగ్రెస్ తమకు దారిదాపుల్లో కూడా లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి పాన్డబ్బాలు, టీ స్టాళ్ల వద్ద అసత్య ప్రచారం చేస్తున్నదని చెప్పారు. దీనికి గొప్పగా వారు పోల్ మేనేజ్మెంట్ అనే పేరు పెట్టారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రతి స్థానాన్ని బ్రహ్మాండంగా గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. లేని విషయాలను కాంగ్రెస్ ఉన్నట్లుగా క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు. గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్తే అసలు విషయాలు తెలుస్తాయన్నారు.
బీజేపీకి రాష్ట్రంలో 119 స్థానాల్లో పోటీ చేసే శక్తి లేదని తాము ఎప్పుడో చెప్పామన్నారు. కర్ణాటక ఎన్నికలకు ముందు కొందరు కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఎదుగుతుందంటూ అందులో చేరారని, అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత మళ్లీ తిరుగుముఖం పట్టారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉండదన్నారు. కాంగ్రెస్ నుంచి సీఎం అవుతామని చెప్పుకుంటున్న నాయకుడు కూడా ఓడిపోయే స్థితిలోనే ఉన్నారని పేర్కొన్నారు. 10 హెచ్పీ మోటర్లు పెట్టాలన్నప్పుడే రేవంత్రెడ్డికి వ్యవసాయం అంటే తెలియదని ప్రజలకు అర్థమైందన్నారు. మూడు గంటల కరెంటు ఉంటే సరిపోతుందని కాంగ్రెస్ చెబుతున్నదని విమర్శించారు. తెలంగాణ రాక ముందు 7778 మెగావాట్ల కరెంటు వినియోగం ఉండగా, ఇప్పుడు 26 వేలకు పెరిగిందని గుర్తు చేశారు.
గోదావరి నదిపై కాంగ్రెస్, టీడీపీలు 60 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు మాత్రమే కట్టారని, పదేళ్లలోనే కేసీఆర్ 5 ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు. రాష్ట్రంలో 44 వేల చెరువుల్లో మిషన్ కాకతీయ కింద మరమ్మతులు చేయించడంతో నిండు కుండల్లా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ముందు నుంచి మైనార్టీలను ఓటు బ్యాంకుగా మార్చుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలోనే మతకలహాలు జరిగాయని గుర్తు చేశారు. వారి పాలనలో సీఎంను మార్చాలన్నప్పుడల్లా మత ఘర్షణలు సృష్టించే వారని విమర్శించారు. వారి కాలంలో ముస్లింలు అన్యాయానికి గురయ్యారన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ అనే పదాన్ని మరిచిపోయే విధంగా శాంతిభద్రతలను కాపాడుతున్నట్లు తెలిపారు. వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాదన్నారు. ఒక్క హుజూరాబాద్లోనే త్రిముఖ పోటీ ఉందన్నారు. కరీంనగర్లో గంగుల కమలాకర్ భారీ మెజార్టీతో గెలుస్తారని స్పష్టం చేశారు.
ఎంపీ బండి సంజయ్ ఒక్క పని అయినా చేశాడా అని ప్రశ్నించారు.? తాము కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా కరీంనగర్కు స్మార్ట్సిటీ సాధించామని తెలిపారు. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ మంజూరు చేయించి ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించినట్లు గుర్తు చేశారు. మధ్య మానేరుపై రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు చేశామన్నారు. మధ్య మానేరులో రెండు కిలోమీటర్ల మేరకు ఈ బ్రిడ్జి తెలంగాణ యువత గర్వపడేలా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు చేశామన్నారు. ఎంపీగా గెలిచిన నాయకులు ఇలాంటివి ఆలోచన చేయాలని సూచించారు. కానీ, బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరపత్రం ఇచ్చారని, తాను ఎంపీగా స్ట్రీట్ లైట్లు పెట్టించానని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు వస్తాయని వాటిని ఖర్ఛు చేయాల్సిందేనని అన్నారు.
ఎన్నికల కోసం యువతలో మతవిద్వేషాలను రెచ్చగొట్టడం సరికాదన్నారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని తెలిపారు. గొప్ప రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్రంలో ఈ పదేళ్ల కాలంలో 1.64 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆదాయం పెంచే విధంగా పథకాలను తీసుకువస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ట్రస్మా నాయకుడు శేఖర్రావు, బీఆర్ఎస్ నాయకులు జక్కుల నాగరాజు, దూలం సంపత్గౌడ్, సత్యంరావు, సాయికృష్ణ పాల్గొన్నారు.