తిమ్మాపూర్, జూన్ 10 : “ఒకనాటి తెలంగాణను చూస్తే.. అన్నల అలజడులు, పోలీసుల ఎన్కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలతో ఆగమాగం ఉండేది. నేడు సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరిపానతో ఎంతో అభివృద్ధి చెందుతున్నది” అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గన్నేరువరం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సుపరిపాలన అందించేందుకే సీఎం కేసీఆర్ జిల్లాలు, మండలాలను విభజించారని, నేడు గన్నేరువరం మండల చిన్న మండలంగా క్షేత్రస్థాయిలో అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. పాత చరిత్ర తెలిస్తేనే కొత్త చరిత్ర తెలుస్తదని, ఉమ్మడి పాలనలో ఏరోజు పేపర్ చూసినా రైతుల ఆత్మహత్యలు ఉండేవని, నక్సలైట్ల ఎంకౌంటర్ల వార్తలతో అలజడి ఉండేదన్నారు. రాత్రి పూట కరెంటు పెట్టడానికి వెళ్లిన కుటుంబసభ్యులు కరెంటు షాక్, పాముకాట్లు, ప్రమాదాలతో మరణించిన విషాదాలు ఎన్నో ఉన్నాయన్నారు.
ఉద్యమం నడుస్తున్న సమయంలో పెద్దపల్లిలో రాంరెడ్డి అనే రైతు రాత్రిపూట మోటర్ ఆన్ చేసేందుకు వెళ్లాడని, ప్రమాదవశాత్తు మరణించగా ఎండ్రికాయలు సగం కొరుక్కుతిన్నాయని పోస్టుమార్టంలో వచ్చిన నివేదికను గుర్తు చేశారు. ఆ సమయంలో కేసీఆర్ డిప్యూటీ స్పీకర్గా ఉండేవారని, ఇలాంటి విషాద వార్తలతో తెలంగాణ ఇలా ఎందుకు ఉన్నదని మథన పడేవారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన వెంటనే మన నీళ్లు, బొగ్గుతో కరెంటు తయారు చేసుకుంటున్నామని, రాష్ట్రం విభజనలో వచ్చిన నిధులతోపాటూ అప్పులు తెచ్చి కరెంటు తయారు చేసుకుని విద్యుత్ వెలుగులతో విరాజిల్లుతున్నట్లు తెలిపారు.మన పాలన మనది కాబట్టే కిలోమీటర్ల ఎత్తుకు కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు తీసుకువచ్చి కోటి ఎకరాలకు సాగు నీరిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ రాకముందు ఇంతమంచి పాలన ఉండేదా? అని ప్రశ్నించారు. మండలాన్ని ఇంకా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందన్నారు.
పదిహేను రోజుల్లో టెండర్లు పూర్తి చేసుకుని త్వరలోనే గన్నేరువరం మండల కేంద్రానికి డబుల్ రోడ్డు పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. అంతకుముందు గ్రామ చౌరస్తా నుంచి పాఠశాల వరకు భారీ ర్యాలీ తీశారు. వినోద్కుమార్, రసమయి బాలకిషన్, జీవీఆర్, తదితరులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే సాంస్కృతిక సారథి కళాకారులు ఆటాపాటలతో ధూంధాం చేశారు. మం డల వాసులు, లబ్ధిదారులతో సభపై మాట్లాడించారు. ప్రభుత్వం మండలానికి చేసిన అభివృద్ధి, పథకాలపై లబ్ధిదారులు మాట్లాడిన వీడియో ప్రదర్శించగా.. సభికులు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రవీందర్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు గంప వెంకన్న, ఆర్బీఎస్ జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న, స్థానిక సర్పంచి పుల్లెల లక్ష్మి, ఆర్బీస్ మండల కోఆర్డినేటర్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.