రాజన్న సిరిసిల్ల, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘నాకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన. నన్ను నాలుగు సార్లు గెలిపించారు. ఐదోసారి జరుగుతున్న ఎన్నికల్లోనూ మీ బిడ్డగా భారీ మెజార్టీతో ఆశీర్వదించండి’ అని సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ విజ్ఞప్త్తి చేశారు. తొమ్మిదిన్నర ఏండ్లలో సిరిసిల్లను దేశం గర్వించేలా తీర్చిదిద్దానని, తాను చేసిన అభివృద్ధిని వివరిస్తూ రూపొందించిన ప్రగతి నివేదికలను ఇంటింటికీ పంపిస్తానని చెప్పారు. యాభై ఐదేండ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ఏం చేశాయో ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. గురువారం ఆయన సాదాసీదాగా సిరిసిల్ల అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేశారు. అనంతరం జిల్లాకేంద్రంలోని తెలంగాణ భవన్కు వెళ్లి, ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకున్న ధైర్యం, బలం, బలగం.. నాయకులు, కార్యకర్తలేనని స్పష్టం చేశారు. తామే అభ్యర్థి అన్నవిధంగా రేయింబవళ్లు శ్రమిస్తూ తనను మరోసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరారు.
నాడు సిరిసిల్ల ఎట్లుండె.. నేడు ఎట్లయ్యిందో.. నేను చేసిన పనులు మీ కండ్ల ముందే కనిపిస్తున్నామని మంత్రి వివరించారు. వస్త్ర పరిశ్రమకు జీవం పోసి నేతన్నల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చేశానని తెలిపారు. అసాధారణమైన ప్రగతితో జిల్లాకు కావాల్సిన అన్ని హంగులను సమకూర్చిపెట్టానని చెప్పారు. ఈ ప్రాంత విద్యార్థుల ఉన్న త చదువులకు నోచుకునేలా మెడికల్, వ్యవసాయ పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాల, నర్సింగ్, జేఎన్టీయూ, ఐటీఐ కాలేజీలు, అంతర్జాతీయ శిక్షణ సంస్థను ఏర్పాటు చేశానని చెప్పారు. గోదావరి జలాలతో మెట్టను అభిషేకిస్తానని ఇచ్చి న హామీని నిలబెట్టుకున్నామన్నారు. మధ్యమానేరు ప్రాజె క్టు పూర్తి కావడంతో సిరిసిల్ల మానేరులో 360రోజులు నీటితో కోనసీమను తలిపించేలా చేశానన్నారు.
మీ ఆశీర్వాదంతో.. మీ అండదండలతో ఈ స్థాయికి ఎదిగానని అమాత్యుడు కృతజ్ఞతగా చెప్పారు. సిరిసిల్లను ఇంకా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను గెలిపించాల్సిన బాధ్యత వర్కింగ్ ప్రెసిడెంట్గా తనపై ఉందన్నారు. నాకున్న ఒత్తిడి వల్ల గడపగడపకూ రాలేక, మీ అందరిని కలువలేకపోతున్నానన్నారు. కానీ, నన్ను గుండెల్లో పెట్టుకున్న సిరిసిల్ల ప్రజలు, కార్యకర్తలంతా కలిసి భారీ మెజార్టీతో గెలిపించి దీవిస్తారన్న నమ్మకం ఉందన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న వ్యక్తినని, ప్రజల ఆలోచన సరళికి దర్పంపట్టే విధంగా ఈ ఎన్నికల్లో ఫలితాలు ఉండబోతున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ సిరిసిల్లకు ఏం చేశాయో..? ఆ పార్టీ నాయకులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చా రు.
తాత్కాలిక ప్రయోజనాలకు లొంగిపోతే.. మళ్లీ యాభై ఏండ్లు బాధపడాల్సి వస్తుందని హెచ్చరించారు. సిరిసిల్ల ప్రజలపైనా, మా నాయకత్వంపైనా పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఎవరూ ఎన్ని ప్రలోభాలు పెట్టినా.. కుట్రలు చేసి నా.. కుతంత్రాలు పన్నినా సిరిసిల్ల ప్రజలు అభివృద్ధి కాముకులు, చైతన్యవంతులన్నారు. ఎన్నిమాటలు చెప్పినా.. ఎన్ని పిట్ట కథలు చెప్పినా లొంగిపోరన్నారు. కండ్ల ముం దు కనిపిస్తున్న అభివృద్ధి, ఇంటింటికీ చేరుతున్న సంక్షేమం ఈ రెండు తప్పకుండా గెలిపిస్తాయన్న నమ్మకం నాలో ఉందన్నారు. నిర్విరామం లేకుండా.. సిరిసిల్ల ప్రజల కోసం పదిహేనేండ్లుగా పని చేశానని తెలిపారు. తనను మరోసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరారు. అభివృద్ధి, ప్రగతి ప్రస్థానంతో గౌవర ప్రదమైన మెజార్టీతో తిరిగి గెలుస్తానన్న సంపూర్ణ విశ్వాసం తనకు ఉందన్నారు.
నాకున్న ధైర్యం, నాబలం నా గులాబీ దండు.. నా అన్నలు, తమ్ముళ్లు, నాయకులు, కార్యకర్తలేనని స్పష్టం చేశారు. తామే అభ్యర్థి అన్నవిధంగా రేయింబవళ్లు శ్రమిస్తూ తనను నాలుగు ఎలక్షన్లలో గెలిపించారని చెప్పారు. ఐదో ఎన్నికల్లో కూడా తన కు విశ్వాసం ఉందన్నారు. కరెంట్, నీళ్లు ఇవ్వని కాంగ్రెస్, సంక్షేమం ఇవ్వని బీజేపీకి ఓటేద్దామా..? తొమ్మిదిన్నరేండ్లు మీ లో ఒకడిగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడ్డ కేసీఆర్ అభ్యర్థిగా తనకు ఓటేస్తారా..? అని ప్రజలు ఆలోచించాలని సూచించారు. కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ తదితరులు పాల్గొన్నారు.