కోల్సిటీ, మార్చి 19: రాజ్యాంగ సంస్థను తమ జేబులో పెట్టుకొని మోడీ ఆడుతున్న నాటకాలకు తెర దించుతామని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. బీజేపీ అంటేనే భారతీయ జూమ్లా పార్టీ అని, అంబేద్కర్ బతికి ఉంటే మోడీని చూసి సిగ్గుతో ఆత్మహత్య చేసుకునేవాడని మండిపడ్డారు. రాజ్యాంగ సంస్థను అడ్డుపెట్టుకొని ఒక మహిళ అని కూడా చూడకుండా ఇన్ని కుట్రలు చేస్తారా..? అని దుయ్యబట్టారు. గోదావరిఖనిలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఈడీలకు, బేడీలకు భయపడే చరిత్ర బీఆర్ఎస్ది కాదని, బీఆర్ఎస్ నెత్తురులోనే పోరాటం ఉందని, జూమ్లా పార్టీని బొంద పెట్టి తీరుతామని, దేశంలో బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ఎర్రోళ్ల శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. 60లక్షల సభ్యత్వం ఉన్న ఏకైక బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ప్రధాని మోదీ రాజ్యాంగ సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చుకొని కుట్రలకు పాల్పడుతున్నారనీ, ప్రజా క్షేత్రంలో మోడీ విధానాలను ఎండగడుతామన్నారు. అబద్ధాలు ఆడితే తప్ప తెలంగాణలో అధికారంలోకి రాలేమన్న వక్రబుద్ధితో బీజేపీ పార్టీ నీచ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతున్నదన్నారు. ఇప్పటివరకు ఈడీ, సీబీఐ సంస్థలు 4222 కేసులు నమోదు చేస్తే అందులో కేవలం 25 కేసులు మాత్రమే నిలబడ్డాయన్నారు.
బీజేపీకి అసలైన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ అవతరించడంతో కుట్ర పూరితంగానే ఎమ్మెల్సీ కవితక్కపై ఈడీ కేసులు పెట్టిస్తున్నారన్నారు. మోడీని సీఎం కేసీఆర్ తన మేధాసంపత్తితో నిలదీస్తే సమాధానం చెప్పలేక ఈడీ అడ్డుపెట్టుకొని రాజ్యాంగంపై నమ్మకం లేకుండా చేస్తున్నారన్నారు. ఈడీ అంటేనే మోడీ నోటీసులు, సమన్లుగా మారిందన్నారు. తెలంగాణలో ఆసరా పింఛన్ 2వేలు ఇస్తే మోడీ రాష్ట్రంలో 750 ఇస్తున్నాడన్నారు. ఎమ్మెల్యేలను కొనేందుకు ఇప్పటివరకు 12, 515 కోట్లు ఖర్చు చేసారనీ, ఒక్క మహారాష్ట్రలోనే 6వేల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. ఇవన్నీ ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాజ్యాంగ సంస్థలు కూడా మోడీకి వేటకుక్కల్లా మారడం దేశానికి అవమానంగా భావిస్తున్నామన్నారు. రాజ్యాంగం పుస్తకాన్ని కూడా మట్టిలో కలిపిన పార్టీ బీజేపీ అని నిప్పులు చెరిగారు. రాజస్థాన్లో 21 మంది ఎమ్మెల్యేలపై సీబీఐతో దాడులు చేయిస్తే వారంతా పార్టీలో చేరడంతో ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే లంచం తీసుకుంటూ పట్టుబడితే అసలు కేసే లేదన్నారు.
రాజ్యాంగంపై గౌరవంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మించారనీ, అలాగే నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి చిత్తశుద్ధి చాటుకున్నారనీ, మరి ఈ బండి సంజయ్, గుండు అరవింద్ పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పెట్టిస్తారా? అని ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న బీజేపీ అధికారంలోకి వచ్చాక అది సాధ్యపడదు అని చెప్పడం ఏమిటన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలనీ, మళ్లీ తెలంగాణలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనేన్నారు. ఏప్రిల్ 20 నాటికి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేయాలన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలో బలమైన పార్టీగా పెద్దపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. 14న అంబేదర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రాలు, గ్రామాలు, పట్టణాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మే 1 నాటికి అన్ని కమిటీలు పూర్తి చేస్తామన్నారు.
ఇంత నీచ రాజకీయాలా..?: ఎమ్మెల్యే కోరుకంటి
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక బీజేపీ ప్రభుత్వం ఈడీని అడ్డు పెట్టుకొని అరెస్టులతో భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఏది జరిగినా కేసీఆర్ కుటుంబంపైనే రుద్దడం బీజేపీకి పరిపాటైందన్నారు. నిన్నటికి నిన్న పేపరు లీకు వ్యవహారంలో మంత్రి కేటీఆర్పై ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. ప్రపంచ పటంలో తెలంగాణను మోడల్గా నిలబెట్టి హైదరాబాద్ను అద్భుతంగా తీర్చిదిద్దుతూ విద్యార్థులు, యువకుల భవిష్యత్కు ఎన్నో పరిశ్రమలను తీసుకవస్తున్న మంత్రి కేటీఆర్పై టీఎస్పీఎస్ ప్రశ్నాపత్రాల అభియోగం మోపడం సిగ్గుచేటన్నారు.
ఎమ్మెల్సీ కవితక్కపై ఈడీ అస్ర్తాలను ప్రయోగించి భయపెట్టాలని చూడడం మోడీ తరం కాదనీ, మొదటి నుంచి పోరాట చరిత్ర ఉన్న బీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము లేక బీజేపీ ప్రభుత్వం నీచాతినీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీ వల్ల దేశానికి ఉపయోగం లేదన్నారు. బీజేపీలోని కార్యకర్తలే ఆ పార్టీని చీదరించుకుంటున్నారన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ను అభాసుపాలు చేయాలని కుట్రలు పన్నుతున్న బీజేపీని ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవదన్నారు. ప్రతి ఇంట్లో విద్యార్థులు, యువకులు కేటీఆర్ నామస్మరణం చేస్తున్నారనీ, ఇవాళ ప్రశ్నపత్రాల లీక్ను అడ్డు పెట్టుకొని కేటీఆర్పై విమర్శలు చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. సమావేశంలో నాయకులు పీటీ స్వామి, తానిపర్తి గోపాల్రావు, వాసంపల్లి ఆనంద్బాబు, అచ్చ వేణు, వంగ శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, చెల్కలపల్లి శ్రీనివాస్, ప్రజాప్రతినిధు లు తదితరులు పాల్గొన్నారు.