కరీంనగర్ రాంనగర్/వేములవాడ టౌన్, డిసెంబర్ 14: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూలగొడుతుందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్లో కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ అనంతరం మాట్లాడారు. అంతకు ముందు వేములవాడలో రాజన్నను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి దర్శించుకొని కోడెమొక్కు చెల్లించుకున్నారు. తర్వాత విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరూ చేయరని విషయాన్ని బండి సంజయ్ గుర్తించాలన్నారు. బండి వ్యాఖ్యలు జ్యోతిష్కుడి మాదిరిగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అయోధ్య రామాలయం ప్రారంభం ఎన్నికల స్టంటేనని, జగద్గురువులు చెప్పినా గానీ అశాస్త్రీయంగా ఆలయ ప్రారంభోత్సవాన్ని చేయాలనుకోవడం సరికాదన్నారు. వైఫల్యం చెందిన ఎంపీలలో బండి సంజయ్ దేశంలోనే నంబర్ వన్ అని ఎద్దేవా చేశారు. దేశ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉంటే ఆరు గ్యారెంటీలతోపాటు పేదల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ చేపడుతుందన్నా రు. ఎవరు ఏం చెప్పినా ఆరు గ్యారెంటీల హామీలను తప్పనిసరిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాముడి కటౌట్లు పెట్టుకొని బీజేపీ ఓట్లు అడిగేందుకు వస్తున్నదని మండిపడ్డారు.
దేవుడిని అడ్డం పెట్టుకొని కొందరు రాజకీయ ప్రచారం చేస్తున్నారని, ఈ విషయాన్ని తాము ప్రశ్నిస్తే హిందువులకు వ్యతిరేకమంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. శివరాత్రి కంటే ముందే ఆలయాభివృద్ధిపై వీటీడీఏ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. హిందూ సంస్కృతీ సంప్రదాయం ఉన్నవారు దేశాన్ని గౌరవిస్తారని, దేవుడు తమకే సొంతం అన్నట్లుగా కొందరి వ్యవహారం ఉందన్నారు. హిందూత్వాన్ని విశ్వసించే ప్రతిఒక్కరూ ఈ విషయంపై ఆలోచన చేయాలని ఆయన కోరారు.