ధర్మారం, ఆగస్టు 24: ధరలు పెంచుడు.. పన్నుల రూపంలో దోచుక తినుడు తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏదీ చేతకాదని, మోడీ పాలనలో ఈ ఎనిమిదేండ్లలో ఒరగబెట్టిందేమీ లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ధర్మారం మండలం కొత్తూరులో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. డీఎంఎఫ్టీ నిధులు రూ.42.76 లక్షల వ్యయంతో నిర్మించిన ఏడు సీసీ రోడ్లు, ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డీఎంఎఫ్టీ నిధులు రూ.3 లక్షల వ్యయంతో నిర్మించిన సెంట్రల్ లైటింగ్ సిస్టం, జీపీ నిధులు రూ. 6.30 లక్షలతో నిర్మించిన నూతన స్తంభాలను ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ పాలనలో పేద వర్గాల సంక్షేమం కోసం ఏ ఒక్క పథకాన్నీ ప్రవేశ పెట్టిన పాపాన లేదని మండి పడ్డారు. దేశంలోని ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తూ కార్పొరేట్లకు మేలు జరిగే విధంగా పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు.
పెట్రోల్, డీజిల్, సిలిండర్ గ్యాస్ ధరలు పెంచి, పేదల నడ్డివిరుస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. జీఎస్టీ పరిధిలోకి చివరకు నిత్యావసర వస్తువులు, నిత్యం ప్రజలు తాగే పాలను చేర్చి దోచుక తింటున్నారని దుయ్యబట్టారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో డబుల్ ఇంజిన్ పాలన పూర్తిగా విఫలమైందని, అక్కడ అంతా ట్రుబుల్ ఇంజిన్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే బీజేపీ నాయకులు కండ్లుమండించుకుంటున్నారని, ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర సర్కారు రూ.10 వేల కోట్లు ఖర్చు చేసి విద్యుత్ కొనుగోలు చేసి వ్యవసాయానికి 24 గంటల సరఫరా చేస్తుంటే దానిని అడ్డుకోవడానికి పంప్సెట్లకు మీటర్లు బిగించే ప్రయ త్నం చేస్తున్నదని, ఈ క్రమంలో అన్ని వర్గాలతో పాటు రైతులు సీఎం కేసీఆర్కు అండగా నిలువాలని మంత్రి కోరారు. సభకు స్థానిక సర్పంచ్ తాళ్ల మల్లేశం గౌడ్ అధ్యక్షత వహించగా, నంది మేడారం, పత్తిపాక ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్య, ఎంపీడీవో జయశీల, ఎంపీవో రమేశ్, జీపీ కార్యదర్శి విజయ, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పూస్కూరు జితేందర్రావు పాల్గొన్నారు.