హుజూరాబాద్/ హుజూరాబాద్ రూరల్/ వీణవంక/ కమలాపూర్, నవంబర్ 1: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ మొసలి కన్నీరు కారుస్తూ, మాయమాటలు చెప్తాడని, ప్రజలు మోసపోవద్దని హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి సూచించారు. బుధవారం ఆయన తన ప్రచారభేరి మోగించారు. ఉదయం వీణవంకలోని తన నివాసంలో ఇష్టదైవానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన సతీమణి శాలిని వీరతిలకం దిద్ది ప్రచారానికి సాగనంపారు. అనంతరం కమలాపూర్ మండలం గోపాల్పూర్ గ్రామ పరిధి బత్తివానిపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి గోపాల్పూర్, శనిగరం, మాదన్నపేట, గూనిపర్తి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.
తర్వాత హుజూరాబాద్ మండలంలోని ధర్మరాజుపల్లి, కందుగుల, కనుకులగిద్ద, హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లి గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ఉప ఎన్నికల్లో కడుపులో తల పెట్టి ఈటల మోసపూరిత మాటలు చెప్పాడని, గెలిచిన తర్వాత కన్నెత్తి చూడలేదని, ఇప్పుడు మరోసారి ఎన్నికలు రాగానే వస్తున్నాడని చెప్పారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, అవి ప్రతి ఇంటికీ వర్తించాయని గుర్తు చేశారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే సీఎం కేసీఆర్ చొరవతో శనిగరంను మండలంగా ఏర్పాటు చేయడంతోపాటు డీబీఎం 24 ఎస్సారెస్పీ కాలువను విస్తరించి ప్రతి ఎకరాకు సాగునీరందించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. శనిగరం గ్రామంలో పర్కాల-హుజూరాబాద్ నాలుగు లైన్ల రహదారిపై సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీసీ బంధు చెక్కులను ఆపించాడని తెలిపారు. ఆయనకు ఏడుసార్లు అవకాశం ఇచ్చినా ఎలాంటి అభివృద్ధీ చేయలేదని మండిపడ్డారు. పేదల కోసం పనిచేసే బీఆర్ఎస్కు అండగా నిలువాలని కోరారు.
పాడి ప్రచారంలో భాగంగా ఊర్లకు ఊర్లు ఆయన వెంట కదిలాయి. గ్రామాల్లో ఇసుకపోస్తే రాలనంత జనం తరలివచ్చారు. కౌశిక్రెడ్డి ఇంటింటికీ తిరిగి మహిళలు, వ్యాపారులను ఓటు అభ్యర్థించారు. హుజూరాబాద్ మండలం ధర్మరాజుపల్లి, కందుగుల, కనుకులగిద్ద గ్రామాల్లో గ్రామస్తులు తమ ఇళ్లకు తాళం వేసి కౌశిక్ వెంట నడిచారు. హుజూరాబాద్ పట్టణంలోని బోర్నపల్లి చౌరస్తాలో ప్రచారం చేయగా చౌరస్తా జనంతో కిక్కిరిసింది. కౌశిక్రెడ్డి ప్రచారపర్వానికి ప్రజలనుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ప్రతిపక్షాలు గుండెళ్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ప్రచారంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ విజయ, ఎంపీపీ తడక రాణి, జడ్పీటీసీలు బక్కారెడ్డి, కల్యాణి, సర్పంచులు లక్ష్మారెడ్డి, ప్రభావతి, లడె గోపాల్, పింగిళి రవళీరంజిత్రెడ్డి, ఎంపీటీసీలు పద్మ, వేణుగోపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐలన్న, నాయకులు పింగిళి ప్రదీప్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, నాయకులు సురేందర్రెడ్డి, చొల్లేటి కిషన్రెడ్డి, రవీందర్రావు ఉన్నారు.
ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు అవుతున్నా నియోజకవర్గానికి రాకుండా ముఖం చాటేశాడు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఒక్క పైసా తీసుకురాలేదు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చారు. కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో ఈటల చెప్పాలి. గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకు మోసపు మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. మళ్లీ ఇక్కడి ప్రజలు ఆయనను నమ్మరని గజ్వేల్లో పోటీ చేస్తున్నడు. పైసా పనిచేయని బీజేపీ, కాంగ్రెస్ కావాలా? కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కావాలా? ప్రజలు నిర్ణయించుకోవాలి. కాంగ్రెస్ను నమ్మి కర్ణాటకలో ఓటేస్తే ఐదు గంటల కరంటు ఇవ్వడం లేదని అక్కడి రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఐదు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా? 24 గంటల కరంటు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా? తేల్చుకోవాలి. బీజేపీ నుంచి నయాపైసా పట్టుకురాని ఈటలను గ్రామాల్లో తిరుగనివ్వద్దు.
– గెల్లు శ్రీనివాస్యాదవ్, రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్
బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రిగా కేసీఆర్ డ్రైవర్గా ఉంటే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు డ్రైవర్ (సీఎం)లేడన్నారు. డ్రైవర్లు లేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బస్సు ఎక్కుతారో, డ్రైవర్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ బస్సు ఎక్కుతారో ప్రజలు నిర్ణయించుకోవాలని హుస్నాబాద్, హుజురాబాద్ నియోజకవర్గాల బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జీ ఇనుగాల పెద్దిరెడ్డి విమర్శించారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని అభివృద్ది చేసే పార్టీకి అండగా నిలుస్తే మరింత అభివృద్ది జరుగుతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే అభివృద్ది కుంటుపడుతుందని నియోజకవర్గాన్ని ఎవరు పట్టించుకోరన్నారు.
– పెద్దిరెడ్డి, బీఆర్ఎస్ హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల ఇన్చార్జి