ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్కం టాక్స్ లిమిట్ను 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసిన బీజేపీ, అధికార పగ్గాలు చేపట్టగానే ఆ విషయాన్ని మరిచిపోయింది. పెరిగిన వేతనాలకు అనుగుణంగా ఆదాయ పన్ను పరిమితిని పెంచడంపై వివక్ష చూపుతున్నది. ఫలితంగా వేతనజీవులకు పదేళ్లుగా ఎదురుచూపులే మిగులుతున్నాయి. నేడు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడుతుండగా.. మళ్లీ ఆశలు చిగురించాయి. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఈ సారైనా కేంద్రం కరుణ చూపుతుందా..? ఆదాయ పన్ను పరిమితిని పెంచుతుందా..? లేదా అన్న ఉత్కంఠ వేతన జీవుల్లో కనిపిస్తున్నది.
Union Budget | కరీంనగర్, జనవరి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : న్యాయబద్ధంగా ఉద్యోగులకు వేతన ఒప్పందాల ద్వారా సాలరీలను కొంత మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతూ వస్తున్నాయి. ఆ మేరకు ఖర్చు లు కూడా పెరుగుతున్నాయి. అయితే పెరుగుతున్న వేతనాలకు అనుగుణంగా ఆదాయ పన్ను పరిమితి మాత్రం పెరుగడం లేదు. దీంతో పెంచిన వేతనాలను తిరిగి కేంద్రం పన్ను రూపేణా మింగేస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఆదాయ పరిమితిని 2.50 లక్షల నుంచి 5 లక్షలకు పెంచి తీరాలని గత యూపీఏ ప్రభుత్వాన్ని ఆనాటి బీజేపీ నాయకులు పార్లమెంట్లో డిమాండ్ చేశారు.
ఆ పార్టీ నేత అరుణ్జైట్లీ ఈ విషయంపై యూపీఏ ప్రభుత్వాన్ని నిలదీశారు కూడ. అయితే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను నాయకులు పట్టించుకోలేదు. పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న మోడీ ప్రభుత్వం.. వేతన జీవులపై ఏమాత్రం కనికరం చూపడం లేదు. పన్ను పరిమితి పెంచే విషయంలో వివక్ష చూపుతూనే వస్తున్నది. పదేళ్ల కాలంలో కొత్తగా ఒక స్లాబ్ను తీసుకొచ్చిందే తప్ప.. పరిమితి మాత్రం పెంచ లేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉన్న పాత స్లాబ్ను అమలు చేస్తూనే.. కొత్త స్లాబ్ను కలిపి రెండు రకాల స్లాబ్లను ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్నది. అంతే తప్ప ఆదాయ పన్ను, స్టాండర్డ్ డిడక్షన్, అలాగే పొదుపు మినహాయింపు పరిమితులు మాత్రం పెంచడం లేదు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉన్న స్లాబ్ ప్రకారం చూస్తే.. 2.50 లక్షల నుంచి 5 లక్షల వరకు 5శాతం, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20శాతం, 10 లక్షలకుపైగా ఆదాయముంటే 30 శాతం టాక్సు చెల్లించాలి. అలాగే బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన స్లాబ్ ప్రకారం చూస్తే.. 2.50 లక్షల నుంచి 5 లక్షల వరకు 5 శాతం, 5లక్షల నుంచి 7.5 లక్షల వరకు 10శాతం, 7.5లక్షల నుంచి 10 లక్షల వరకు 15 శాతం, 15లక్షల నుంచి 12.50 లక్షల వరకు 20శాతం, 15 లక్షలకు పైబడి ఆదాయముంటే 30శాతం టాక్సు చెల్లించాలనే స్లాబ్ను అమలు చేస్తున్నది. అయితే బీజేపీ అమల్లోకి తెచ్చిన రెండో స్లాబ్ను మెజార్టీ వేతన ఉద్యోగులు పక్కన పెట్టారు. ఈ స్లాబ్ను ఎంచుకుంటే.. పొదుపు పరిమితి అంటే 1. 50లక్షలు మినహాయింపులు వర్తించవు. గృహరుణాలపై ఇంట్రెస్టు మినహాయింపులు వర్తించవు. అందుకే ఉద్యోగులంతా మొదటి స్లాబ్నే ఆధారంగా చేసుకొని పన్ను చెల్లిస్తున్నారు.
ఈ స్లాబ్లను మార్చాలని, ముఖ్యంగా ఆదాయ పన్ను పరిమితిని 2.50 నుంచి 5 లక్షలకు పెంచాలని మోడీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి వేతన జీవులు కోరుతున్నారు. అలాగే ప్రస్తుతమున్న పొదుపు పరిధి 1.50 లక్షల నుంచి 3 లక్షలకు పెంచాలని చాలా ఏండ్లుగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. బ్యాంకు ఇంట్రెస్టు మినహాయింపును 2 లక్షలనుంచి 3 లక్షల వరకు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయినా మోడీ ప్రభుత్వం మాత్రం వీటిని ఏమాత్రం లెక్క చేయడం లేదు. ప్రతి బడ్జెట్ సమయంలో కేంద్రం ఏమైనా కరుణిస్తుందా..? అని ఎదిరి చూడడం, తీరా కేంద్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో వస్తున్న మధ్యంతర బడ్జెట్పై మళ్లీ ఆశలు పెరుగుతున్నాయి. ఈ సారైనా కేంద్రం కరుణ చూపుతుందా..? లేక గతంలో మాదిరిగానే దాటవేస్తుందా..? అన్న దానిపై జోరుగా చర్చ జరుగుతున్నది.
ఉద్యోగ, ఉపాధ్యాయ, ఎలక్ట్రిసిటీ వంటి విభాగాలే కాదు, అన్ని విభాగాల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఉమ్మడి జిల్లాలో 30వేల పైచిలుకు ఉన్నది. ప్రతి ఉద్యోగి ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చారు.వీరితోపాటు పెన్షనర్లు 25 నుంచి 30వేల మంది ఉన్నారు. ఒక్కో ఉద్యోగి సుమారు 60 వేల నుంచి 4లక్షల వరకు ట్యాక్సులు కడుతున్నారు. ఉద్యోగుల గణాంకాల ప్రకారం చూస్తే.. సగటున 1.50 లక్షల వరకు పన్ను చెల్లింపులు జరుగుతున్నాయి. ఆ లెక్కన చూస్తే.. ఏటా ఉమ్మడి జిల్లా ఉద్యోగులు 450కోట్ల వరకు ఆదాయ పన్నును కేంద్రానికి చెల్లిస్తున్నారు.
ఇది చాలదన్నట్లుగా ట్యాక్సు కటింగ్పై మళ్లీ 4 శాతం సర్చార్జీని విధించి కేంద్రం వసూలు చేస్తున్నది. ఇది కూడా అదనపు భారంగా ఉంటున్నది. కొంత మంది పెన్షనర్లు కూడా పన్ను కోవలోకి వస్తున్నారు. వీరు ఆదాయప న్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో నేటి కేంద్ర బడ్జెట్పై ఆశలు పెట్టుకున్నారు. ఈ సారైనా ఆదాయపన్ను పరిమితి పెంచాలని డిమాం డ్ చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా..? లేదా? అన్నది నేడు తేలనుండగా, ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.