కరీంనగర్ మరో దివ్య క్షేత్రానికి వేదిక కాబోతున్నది. నగరం నడిబొడ్డున కలియుగ ప్రత్యక్షదైవం తిరుమలేశుడి ఆలయానికి నేడే అంకురార్పణ జరగబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పద్మనగర్లో కేటాయించిన పదెకరాల స్థలంలో టీటీడీ ఆధ్వర్యంలో అద్భుతమైన వెంకన్న గుడి నిర్మించేందుకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం భూమి పూజ, సాయంత్రం కల్యాణోత్సం కనులపండువలా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి కాగా, మంగళవారం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పరిశీలించారు. శోభాయాత్ర కోసం రెండు గజరాజులను తీసుకురాగా, నగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది.
– కరీంనగర్ కమాన్చౌరస్తా, మే 30
కరీంనగర్ కమాన్చౌరస్తా, మే 30 : తిరుమల తిరుపతిలో వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి నిత్య పూజా ప్రియుడు. ఆ ఏడు కొండల స్వామి ఆలయంలో ప్రతి రోజూ ప్రత్యూష కాలంతో మొదలై ఆరు సమయాల్లో వేదమంత్రోచ్ఛారణలతో స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలా నిర్వహించే నిత్య కైంకర్య వైభోగాన్ని కరీంనగర్ జిల్లా వాసులు త్వరలోనే ప్రత్యక్షంగా వీక్షించి, భక్తితో తన్మయత్వం చెందనున్నారు. త్వరలోనే కరీంనగర్ మినీ తిరుమలను తలపించేలా ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నది. ఈ క్రమంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం కోసం టీటీడీ ఆధ్వర్యంలో బుధవారం భూమి పూజా కార్యక్రమం, సాయంత్రం కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందులో భాగంగా, జిల్లా కేంద్రంలోని పద్మనగర్లో కేటాయించిన పదెకరాల స్థలంలో బుధవారం ఉదయం 7.26 గంటలకు వేద మంత్రోచ్ఛారణలతో భూమి పూజ, సాయంత్రం శ్రీవారి కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు.
పదెకరాలు.. 20 కోట్లతో నిర్మాణం
కరీంనగర్లోని పద్మనగర్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన పదెకరాల స్థలంలో దాదాపు 20 కోట్లతో టీటీడీ ఆలయం నిర్మాణం కానున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, తదితరులు ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆ మేరకు సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి టీటీడీ అధికారులను సంప్రదించి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఆలయ నిర్మాణ పనుల కోసం ఈ నెల 19న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డితోపాటు స్థపతులు, ఆగమ సలహాదారులు, అర్చకులతో మంత్రి గంగుల, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్, పార్లమెంట్ సభ్యుడు, ‘నమస్తే తెలంగా ణ’ సీఎండీ దీవకొండ దామోదర్రావు, కావేరీ సీడ్స్ అధినేత భాసర్రావు, తదితరులు చర్చించారు. అంతకు ముందు కూడా టీటీడీ స్థపతులు, ఇంజినీర్లను రప్పించి నిర్మాణ స్థలం చూపించి చర్చలు జరిపారు.
తమిళనాడు నుంచి తెప్పిస్తున్న రాతితో నిర్మించనున్న ఆలయ ప్రాంగణంలో తూర్పు దిశలో అద్భుత బావి, ఎడమవైపు కోనేరుతోపాటు మండపాలు, సిబ్బంది గదుల నిర్మాణం చేపట్టనున్నారు. తిరుమలలో మాదిరిగా వైఖానస ఆగమ శాస్త్రోక్త ప్రకారం నిత్య కైంకర్యాలు శ్రీవారికి జరుగనున్నాయి. ఈ దశలో ఈనెల 22న మిధున లగ్నంలో భూకర్షణం అంకుర్వాణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. టీటీడీ ప్రధానార్చకుడు వేణుగోపాలదీక్షితులు ఆధ్వర్యంలో గర్భాలయ స్థలాన్ని నాగలితో దున్ని, నవధాన్యాలు చల్లి, గో పూజ, ముతె్తైదువ, కన్యకా పూజలు నిర్వహించారు.
నేడు భూమి పూజ, కల్యాణం
ఆలయ నిర్మాణానికి బుధవారం భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, టీటీటీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తదితరులు హాజరు కానున్నారు. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లను టీటీడీ, స్థానిక అధికారులు పూర్తి చేస్తున్నారు. అయితే, మంగళవారం తేలికపాటి వర్షం కురిసిన దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర సాయంత్రం 4 గంటలకు మంకమ్మతోట వేంకటేశ్వరాలయం నుంచి ప్రారంభం కానుండగా, ఇందులో రెండు గజరాజులు ప్రత్యేకాకర్షణగా నిలువనున్నాయి. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ నుంచి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. వేంకటేశ్వరస్వామి కల్యాణం కోసం తెప్పించిన 20 వేల లడ్డూలు మంగళవారం జిల్లాకు చేరుకున్నాయి. శ్రీవారి కల్యాణం అనంతరం వాటిని అందించనున్నారు. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం
పద్మనగర్లో ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా మహారాజ గోపురం, ఉత్సవ మండపం, మాడ వీధులు, కల్యాణ మండపం, అద్దాల మండపం నిర్మించనున్నట్లు తెలుస్తున్నది. ఇందుకోసం తమిళనాడు నుంచి ప్రత్యేక రాతి శిల్పాలు తెప్పించనున్నారు. ఆలయ ముందు ఉన్న బావిని స్వామి వారికి పూజా కార్యక్రమాలకు ఉపయోగ పడేలా సుందరంగా తీర్చిదిద్దనున్నారు. అలాగే, ఆలయం వెనుక ప్రాంతంలో అధికారులు, సిబ్బంది కోసం భవనాలను సైతం నిర్మించనున్నారు. ఈ మేరకు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలోని వెంకటాచలంలో నిర్మించిన టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని 2022, మే 28న మంత్రి గంగుల తన బృందంతో సందర్శించారు.
జిల్లాకేంద్రానికి రెండు గజరాజులు
వెంకన్న కల్యాణోత్సవంలో భాగంగా బుధవారం సాయంత్రం వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి పద్మనగర్ టీటీడీ క్షేత్ర నిర్మాణ ప్రతిపాదిత స్థలం వరకు సారెతో శోభాయాత్ర తీయనున్నారు. ఆ తర్వాత సాయంత్రం శ్రీనివాస కల్యాణం జరిపించనున్నారు. మంగళవారం సాయంత్రం తర్వాత జిల్లాకేంద్రానికి రెండు గజరాజులు చేరుకున్నాయి. మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ గజరాజులను పరిశీలించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆలయ నిర్మాణ స్థలంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలను పరిశీలించారు. టీటీడీ ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, శిలాధివాసం, మండపారాధన చేశారు. 31వ తేదీ బుధవారం ఉదయం 6.50 నుంచి 7.20 గంటల వరకు భూమి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
జిల్లా వాసుల అదృష్టం
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం అవుతుండడం జిల్లా వాసులు చేసుకున్న అదృష్టం. ఈ ఆలయ నిర్మాణం 18 నెలల సమయంలో పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఆ తర్వాత తిరుమల తరహాలో ప్రతి పూజా కార్యక్రమాన్ని ఇక్కడి ఆలయంలో నిర్వహిస్తారు. ఈ ఆలయ నిర్మాణంతో జిల్లా ఆధ్యాత్మిక శోభను సంతరించుకోవడంతోపాటు, పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందనుంది. ఈ పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని రాజకీయకోణంలో చూడొద్దు. అన్ని పార్టీల నాయకులతో పాటు ఉమ్మడి జిల్లా ప్రజలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలి.
– గంగుల కమలాకర్, రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖల మంత్రి