Better Medical Services | పెద్దపల్లి, ఫిబ్రవరి17 : జిల్లా ప్రభుత్వ దవాఖానలో మరింత మెరుగైన వైద్య సేవలందించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మీకంగా తనిఖీ చేశారు. రూ.24 లక్షలతో కంటి శస్త్ర చికిత్స విభాగంలో కొత్తగా కొనుగోలు చేసిన ఫాకో యంత్రం పని తీరు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కంటి శస్త్ర చికిత్సను అత్యాధునిక పద్ధతుల్లో విజయవంతంగా చేసేందుకు వినియోగించే ఫాకో యంత్రం జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్, కంటి శస్త్ర చికిత్స నిపుణురాలు డాక్టర్ సబిహా తదితరులు పాల్గొన్నారు.