కలెక్టరేట్, జూలై 23 : దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికి నెలనెలా అందించే పింఛన్ను రూ.3016 నుంచి రూ.4016కు పెంచుతూ శనివారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేయడమే కాకుండా, వచ్చే నెల నుంచే పెంచిన పింఛన్ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నవీన్మిట్టల్ అందులో పేర్కొనడంతో దివ్యాంగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న దీనావస్థను గమనించిన సీఎం కేసీఆర్ గత నెలలో మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన బహిరంగసభలో దివ్యాంగుల పింఛన్ మొత్తాన్ని మరో రూ.1000 పెంచుతున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా, జూలై నెలాఖరు నుంచి పెంచిన పెన్షన్ను పంపిణీ చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం జీవో వెలువరించి దివ్యాంగుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధిని చాటుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులతో వచ్చే నెల నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 65,214 మంది రూ.4016 చొప్పున రూ.26.19 కోట్ల నగదు అందుకోనున్నారు. ఇందులో కరీంనగర్ జిల్లాలో 23,659, జగిత్యాలలో 17,405, పెద్దపల్లిలో 13,949, రాజన్న సిరిసిల్లలో 10,201 మంది ఉన్నారు.
మాకు ఆత్మ బంధువైండు
మా సంక్షేమం కోసం పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మాకు ఆత్మ బంధువైండు. గతంల ఎందరో ముఖ్యమంత్రులను, నాయకులను చూసిన. ఎవరూ మా గురించి ఆలోచన చేయలేదు. మా కష్టాలను పట్టించుకోవడానికి ఏ దేవుడైనా వస్తాడా?, ఏమైనా చేస్తాడా? అని ఎదురు చూసినం. ఆ దేవుడు కరుణించి కేసీఆర్ సార్ రూపంలో పంపించిండు. ఆయన వచ్చినంకనే మా బతులకు ఒక అర్థం దొరికింది. మేం ఆత్మగౌరవంతో బతకడానికి ఇన్నాళ్లూ రూ.3,116 పింఛన్ ఇచ్చిండు. మళ్లీ వెయ్యి పెంచి రూ.4,116 ఇత్తనని చెప్పిండు. చాలా సంతోషంగా ఉంది. నిజంగా సీఎం కేసీఆర్ సార్ మా దివ్యాంగుల పాలిట దేవుడే.
– ముద్రకోల హన్మండ్లు (గంగాధర)
వైకల్యంతో పుట్టినోళ్ళ బాధలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్. నేను ఎన్నో ప్రభుత్వాలను చూసిన. మమ్మల్ని పట్టించుకున్న నాథుడు లేడు. కుటుంబానికి భారమై.. నలుగురిలో మొఖం ఎత్తుకొని తిరుగలేక ఎంతో మంది ఇబ్బందులు పడ్డరు. ఏ పనీ చేయడం సాతగాక ఎన్నో కష్టాలు అనుభవించినం. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ సార్ మాకు భరోసా కల్పించిండు. రూ.3016 పింఛన్తో పాటు తిరగడానికి ట్రైసైకిళ్ళు, బస్పాస్లు ఇచ్చి సమాజంలో గుర్తింపు కల్పించిండు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన ధరలకు నిత్యావసర సరుకులు కూడా రావని మా బాధలు అర్థం జేసుకొని మరో వెయ్యి పెంచి రూ.4016 చేసిండు. మేం నలుగురిలో నవ్వులపాలుగాకుండా మొఖం ఎత్తుకొని బతికేలా చేసింది కేసీఆర్ సారే. మమ్మల్ని ఆదుకున్నందుకు మేం బతికున్నంతకాలం అయనకు అండగా ఉంటం.
– తాటిచెర్ల కొమురయ్య, దివ్యాంగుడు, ఘన్ముక్ల(వీణవంక)
సమాజంలో వివక్షకు గురవుతున్న దివ్యాంగులను సీఎం కేసీఆర్ అక్కున చేర్చుకున్నారు. తెలంగాణ రాక ముందు రూ.500 ఉన్న పింఛన్ను ఇప్పుడు రూ.4,016కు పెంచడం సంతోషంగా ఉంది. సకలాంగులతో సమానంగా పని చేసుకోలేక మేం ఎదుర్కొంటున్న చీదరింపులకు పెరిగిన పెన్షన్ పరిష్కారమార్గం చూపుతుందని భావిస్తున్నాం. ముఖ్యమంత్రి రుణాన్ని ఏమిచ్చినా తీర్చుకోలేం. ఇలాంటి సీఎం పదికాలాల పాటు కొనసాగితే మాలాంటి వేలాది మంది దివ్యాంగులకు ఎంతో మేలు.
– జక్కం సంపత్, దివ్యాంగుల హక్కుల పోరాట సమితి, జిల్లా అధ్యక్షుడు, కరీంనగర్
మాది సాధారణ కుటుంబం. దివ్యాంగుడినైన నాకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్న. ఇంటి వద్ద చిన్న దుకాణం పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇచ్చే రూ.4016 పింఛన్తో ఇంటి అవసరాలు గట్టెక్కినట్టే. నిజంగా గత ప్రభుత్వాలు ఏనాడూ దివ్యాంగులను పట్టించుకోలె. కేసీఆర్ అచ్చినంకనే పింఛన్ను రూ.4 వేలకు తెచ్చిండు. మళ్లీ ఎలచ్చన్ల ఆయనే సీఎం కావాలె. ఆయనుంటెనే మాబోటి వారికి ఇంక ఏమైనాజేత్తరు. ఈ పింఛన్తో కొండంత ధైర్యం అచ్చినట్లయింది.
– తాడిచెర్ల కుమారస్వామి, గోదావరిఖని(కోల్సిటీ)
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు దివ్యాంగులను చిన్నచూపు చూశాయి. వారిని ఆదుకోవడంలో, అండగా నిలవడంలో నిర్లక్ష్యం ప్రదర్శించాయి. ఒకవైపు పని చేయలేక.. మరోవైపు నిత్యావసరాల ధరల పెరుగుదలతో జీవితాలు గడుపలేక కడుపేదరికంలో కొట్టుమిట్టాడారు. అయితే, వీటన్నింటినీ గమనించిన సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా వారి పింఛన్ను మూడు రెట్లు పెంచి ‘ఆసరా’ పథకం ద్వారా రూ.1500 ఇచ్చి కొండంత అండగా నిలిచారు. మళ్లీ 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ను మళ్లీ రెండింతలు చేసి రూ.3016 ఇచ్చి ధైర్యం కల్పించారు. తాజాగా, మరో రూ.1000లు అదనంగా పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడంతో దివ్యాంగులు సీఎం కేసీఆర్ను వేనోళ్ల కొనియాడుతున్నారు.
దివ్యాంగులకు అందించే ఆసరా పింఛన్ను ఏకంగా రూ.4016 చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎల్లవేళలా రుణపడి ఉంటాం. వచ్చే నెల నుంచే ఈ మొత్తాన్ని అందుకోబోతుండటం సంతోషంగా ఉంది. పెరిగిన పెన్షన్ మా కుటుంబానికి ఆదరువుగా మారబోతున్నది. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు దివ్యాంగుల సమస్యలను ఎప్పుడూ పట్టించుకోలే. నెలకు ఐదు వందలే ఇచ్చేది. ఆ మొత్తం కూడా రెండు, మూడు నెలలకోసారి వచ్చేది. బయట పని చేసుకోలేక, కుటుంబాన్ని పోషించలేక అనేక ఇబ్బందులు పడుతుండేవాళ్ళం. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక రూ.1500 చేసింది. గత ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట ప్రకారం రూ.3016కు పెంచింది. ఇప్పుడు రూ.4016కు పెంచడంతో మా సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి స్పష్టమవుతోంది.
– మధుమోహన్, కరీంనగర్
మమ్మల్ని గత ప్రభుత్వాలు ఎన్నడూ పట్టించుకోలే. ప్రత్యేక తెలంగాణలో సీఎం కేసీఆర్ మా సంక్షేమం కోసం పెద్ద పీట వేసిన్రు. అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా పరికరాలు ఇచ్చిన్రు. జీవనోపాధి కోసం సబ్సిడీపై రుణాలు మంజూరు చేయించి అండగా నిలిచిన్రు. తాజాగా, మాకు అందించే పెన్షన్ను మరో రూ.1000 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం చాలా ఆనందంగా ఉంది. మేం ఎవరిపైనా ఆధారపకుండా జీవించేలా రూ.4016 పెన్షన్ ఇవ్వడం హర్షించ దగ్గ విషయం. ముఖ్యమంత్రికి దివ్యాంగులమంతా జీవితాంతం రుణ పడి ఉంటాం.
-లక్కాకుల శ్రీనివాస్, దివ్యాంగుడు, (మంథని)
నిజంగా దివ్యాంగులకు అన్నం పెడుతున్న దేవుడు సీఎం కేసీఆర్. ఇప్పటికే చాలా చేసిన్రు. గృహలక్ష్మి పథకంల 5 శాతం ఇచ్చిన్రు. ఏ పథకంలోనైనా రిజర్వేషన్లు అమలు చేస్తున్రు. గతంల ఏ ప్రభుత్వాలూ పట్టించుకోలె. ఇప్పుడు కేసీఆర్ సార్ దివ్యాంగుల పాలిట దైవంగా వచ్చిన్రు. తల్లిదండ్రులు, బంధువులకు భారంగా ఉన్న దివ్యాంగులకు పెరిగిన పింఛన్ ఒక ఆసరాగా నిలుస్తుంది. ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్నవాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పటికే వీల్చైర్లు, బ్యాటరీ సైకిళ్లు, స్కూటీలు ఇచ్చి ఎంతగానో ప్రోత్సహిస్తున్నరు. ఇప్పుడు పెరిగిన పింఛన్ వల్ల ఆర్థికంగా కొండంత ధైర్యం కలిగినట్లయింది.
– చింతిరెడ్డి సంతోషరెడ్డి, దివ్యాంగుల పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు, గోదావరిఖని(కోల్సిటీ)
నిరుపేద తల్లిదండ్రులకు భారంగా ఉన్న దివ్యాంగులు ఇప్పుడు సొంతగా బతకడానికి ఎంతో భరోసా. ఐదొందల పింఛన్ను 4వేలకు తెచ్చిన గొప్ప సీఎం కేసీఆర్. మల్ల ఆయనే రావాలె. గత ప్రభుత్వాలు దివ్యాంగులను పట్టించు కున్న పాపాన పోలె. సీఎం కేసీఆర్ అచ్చినంకనే దివ్యాంగులకు ఒక భరోసా కలిగింది. ఆ పింఛన్తో ఎవరిమీద ఆధారపడకుండా బతకవచ్చు అన్న ఆత్మవిశ్వాసం కలిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నిక లత్తె మల్ల ఆయన్నే సీఎంగా గెలిపించుకుంటం. దివ్యాంగులకు బతుకు చూపించిన కేసీఆర్ మా పాలిట దేవుడు. ప్రతి సంక్షేమ పథకంలో దివ్యాంగులకు రిజర్వేషన్ ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ ఒక్కరే. దేశంలో ఇంత పింఛన్ ఇస్తున్న ఏ రాష్ట్రం కూడా లేదు. ఒక్క తెలంగాణలోనే 4016 పింఛన్ ఇస్తున్నారంటే దివ్యాంగులు బతకడానికి సరిపోతుంది.
కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు దివ్యాంగులను పట్టించుకోలేదు. తెలంగాణ రాక ముందు నెలకు రూ.500 మాత్రమే పింఛన్ వచ్చేది. తెలంగాణ వచ్చినంక రూ.1500కు పెరిగింది. తర్వాత రూ.3016కి పెరిగింది. తాజాగా, సీఎం కేసీఆర్ రూ.4016కు పెంచి దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపారు. బంగారు తెలంగాణలో భాగంగా దివ్యాంగుల జీవన శైలిలో మార్పులు తీసుకరావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. కేసీఆర్ దయ వల్లనే సమాజంలో ఆత్మ గౌరవంతో బతుకుతున్నాం. మా జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ మరోమారు సీఎం కావడానికి కృషి చేస్తాం.
విధి వక్రీకరించిన నాలాంటి పేదలను సీఎం కేసీఆర్ సార్ ఆదరిస్తుండడం మా అదృష్టం. ఆయన వచ్చినంకనే మాకు సమాజంలో గౌరవం దొరికేటట్టు చేసిండు. నాకు 53 ఏండ్లున్నయి. పదో తరగతి వరకు చదివిన. అట్లనే బ్రెయిలీ లిపి ఢిల్లీలో చదువుకున్న. రేచీకట్ల కారణంగా నా రెండు కండ్లు దాదాపు 25 ఏండ్ల కిందట్నే కనిపించకుండా పోయాయి. తర్వాత అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న. ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. అమ్మ మధురమ్మనే నాకు అన్ని పనులకు సహాయ పడుతది. ఏమీ చేయలేని పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ సార్ నెలనెలా ఇస్తున్న పింఛనే ఆధారమైంది. మా బాధలు అర్థం చేసుకుని రూ.3016 పింఛన్ను మరో రూ.వెయ్యి పెంచి నేనున్నా అనే ధైర్యాన్ని ఇచ్చిన్రు.
– మైలేశ్ రవీందర్, అంధుడు, కొలనూర్ (ఓదెల)
పెంచిన పింఛన్ను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో తమ పట్ల ఉన్న వివక్షను తొలగించే క్రమంలో పెన్షన్ పెంచి సీఎం కేసీఆర్ తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపారని కొనియాడుతున్నారు. దేశవ్యాప్తంగా దివ్యాంగులు అత్యధిక పెన్షన్ తీసుకుంటున్నది కేవలం తెలంగాణలో మాత్రమేనని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.