Beedi workers | మెట్పల్లి, జూలై4: బీడీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. ఏఐటీయూసీ అనుబంధ విభాగం బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం మెట్పల్లి పట్టణ సమీపంలోని వెల్లుల్ల రోడ్డులో గల సాంబాజీ బీడీ కంపెనీ ప్రధాన కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. నాసిరకం తునికాకు, తంబాకు ఇవ్వడం వల్ల చాటింగ్ పేరుతో తీవ్రంగా నష్టపోతున్నామని, నెలకు కేవలం 9,10 రోజులు మాత్రమే పని కల్పిస్తున్నారని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
సాంబాజీ, రాజ్కమల్ బీడీ కంపెనీల యాజమన్యాలు స్పందించి వెంటనే తమకు నాణ్యమైన తునికాకు, తంబాకు సరఫరా చేయాలని, నెలకు 26 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను బీడీ కంపెనీలు గాని, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కటాఫ్ లేకుండా బీడీ కార్మికులందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెలకు రూ.4వేలు జీవన భృతి ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నెల 9న దేశ్యవ్యాప్తకంగా కార్మిక సమస్యలపై సమ్మె జరుగనుందని, కార్మికులందరూ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం బీడీ కార్మికుల డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని బీడీ కంపెనీ ప్రతినిధులకు అందజేశారు. వివిధ గ్రామాల నుంచి వందలాది మంది బీడీ కార్మికులు పాల్గొన్నారు.