విద్యానగర్, జనవరి 20: కంటి వెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. నగరంలోని సప్తగిరి కాలనీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం ఆయన పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్, సీపీకి వైద్యులు కంటి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 18 ఏళ్లు నిండిన వారందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. కంటి పరీక్షల కోసం వచ్చిన వారిని కలెక్టర్ ఆప్యాయంగా పలకరించారు. శిబిరం వద్ద అందుబాటులో ఉన్న సౌకర్యాలు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. శిబిరాలకు వచ్చే వారికి మెరుగైన సేవలందించాలని, శస్త్ర చికిత్స అవసరం ఉన్న వారి వివరాలు రిజిస్టర్లో పొందుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేషన్, జనవరి 20: నగర పాలక సంస్థ పరిధిలోని 13 డివిజన్లలో శుక్రవారం కంటి వెలుగు శిబిరాలు కొనసాగాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సిబ్బంది కంటి పరీక్షలు చేసి మందులు, కళ్లద్దాలు పంపిణీ చేశారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని వంద రోజుల పాటు నిర్వహించనుండగా, ఆయా డివిజన్లలో 13 బృందాలు పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కంటి పరీక్షలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా బల్దియా అధికారులు ఏర్పాట్లు చేశారు. శిబిరానికి వచ్చిన వారి ఆధార్ నంబర్, పేరు, ఇతర వివరాలు నమోదు చేసి లోపలికి పంపిస్తున్నారు. వారికి కంటి పరీక్షలు చేసి అవసరమున్న వారికి మందులు, కళ్లద్దాలు ఇస్తున్నారు. శస్త్ర చికిత్స అవసరమున్న వారి పేర్లు నమోదు చేస్తున్నారు. ఈ శిబిరాల్లో తాగునీరు, కుర్చీలు, ఇతర సౌకర్యాలు కల్పించారు. నగరంలో మొదటి విడుతలో చేపడుతున్న 13 కేంద్రాల్లో ఫిబ్రవరి 2వ తేదీ వరకు పరీక్షలు చేయనున్నారు. అనంతరం మరో 13 డివిజన్లలో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. నగరంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాలను మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ పరిశీలించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచనలు చేశారు.
కొత్తపల్లి, జనవరి 20: కొత్తపల్లి పట్టణంలోని పీహెచ్సీలో 225 మందికి కంటి పరీక్షలు చేశారు. 23 మందికి కళ్లద్దాలు ఇవ్వగా, ముగ్గురికి ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కట్ల వేణుమదవ్, పీహెచ్సీ వైద్యుడు వంశీకృష్ణ, కంటి వెలుగు ఇన్చార్జి దేవేందర్, క్యాంపు కో-ఆర్డినేటర్ శంకరయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఆసిఫ్నగర్లో 158 మందికి కంటి పరీక్షలు చేశారు. 46 మందికి కళ్లద్దాలు, 150 మందికి మందులు పంపిణీ చేశారు. శిబిరాన్ని ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి సందర్శించి పలు సూచనలు చేశారు. వైద్యురాలు మౌనిక, క్యాంపు కో-ఆర్డినేటర్ శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.