వెల్గటూర్, అక్టోబర్ 25: ‘కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అంటున్నది. వాళ్లవన్నీ ఆపద మొక్కులే. గెలిచేదాక ఓ మాట.. గెలిచిన తర్వాత మళ్లీ పాత కథే అవుతుంది. వాళ్ల పాలన మనకు కొత్తనా.. రాష్ర్టాన్ని, దేశాన్ని ఏండ్లకేండ్లు పాలించారు. ఏమైనా చేశారా..? నేనొక్కటే అడుగుతున్నా.. అధికారంలో ఉండి చేయనోళ్లు.. ఇప్పుడు చేస్తరా..? నమ్మితే మోసపోతం. మళ్లీ గోసపడుతం. జాగ్రత్త’ అంటూ ధర్మపురి అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు సూచించారు. ‘కొందరు కాంగ్రెస్ నాయకులైతే అప్పుడే గెలిచి అధికారం చేపట్టినట్టు పగటి కలలు కంటున్నరు. ‘
ఆలూ లేదు.. సూలు లేదు కొడుకు పేరు గోవింద’ అన్నట్లు ఉంది వారి పరిస్థితి. నేనొక్కొటే చెబుతున్నా.. వాళ్లు అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నరని చెప్పారు. వెల్గటూర్ మండల కేంద్రంలో స్థానిక నాయకులతో కలిసి బుధవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సారే గెలువాలన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో రాష్ర్టాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్దేనని పునరుద్ధాటించారు. రాష్ర్టాన్ని 50 ఏండ్లపాటు పాలించిన కాంగ్రెసోళ్లకు పేద ప్రజలకు సాయం చేయాలని సోయే లేదని, కేవలం వారిని ఓటు బ్యాంక్గా మాత్రమే చూశారని మండిపడ్డారు.
ఇక కొందరు నాయకులు పని గట్టుకుని దళితబంధుపై లేనిపోని అసత్య ప్రచారం చేస్తున్నారని, దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పథకం నిరంతరం కొనసాగుతుందని, వచ్చే 5 ఏండ్లలో రాష్ట్రంలోని దళితులందరికీ రూ.10 లక్షల చొప్పున సాయం అందజేస్తామని తెలిపారు. ఇంకా కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కాగానే ‘ఇంటింటికీ కేసీఆర్ బీమా- ప్రజలందరికీ దీమా’ కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సన్నబియ్యం, ఆసరా పింఛన్ రూ.5 వేలు, రైతుబంధు కింద రూ.16 వేలు, ప్రతి మహిళకు సౌభాగ్య లక్ష్మి కింద రూ.3016, మహిళలకు రూ.400 గ్యాస్ సిలిండర్ అందిస్తామని వివరించారు. కాగా, బీఆర్ఎస్ కార్యకర్త గుండా జగదీశ్వర్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఉత్సాహపరిచారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు డోలి దేవ్రాజ్ సతీమణి అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.