పెద్దపల్లి కమాన్/ సిరిసిల్ల టౌన్/ కరీంనగర్ తెలంగాణచౌక్, నవంబర్ 6 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీలు పోరుబాట పట్టారు. రాష్జ్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు మౌన దీక్ష చేపట్టారు. పెద్దపల్లిలో బీఆర్ఎస్ నాయకురాలు, బీసీ జేఏసీ పెద్దపల్లి జిల్లా చైర్పర్సన్ దాసరి ఉష ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. బీసీ కుల సంఘాల నాయకులు నోటికి నల్లగుడ్డలు కట్టుకుకొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ, రిజర్వేషన్ల లక్ష్య సాధన ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు అన్ని బీసీ కులాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా సాధించేందుకు బీసీలంతా ఏకం కావాలని, గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేయాలని అన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జ్యోతిబా ఫూలే విగ్రహం వద్ద బీసీ నాయకులు మూతికి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు పాల్గొన్నారు. కరీంనగర్లోని కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ స ంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలీ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మౌన దీక్షకు జిల్లా అధ్యక్షుడు నాగుల కనుకయ్యగౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ నెల 13న జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్మదీక్ష చేపడుతున్నట్టు పేర్కొన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయం సాత్నకోత్సవానికి విచ్చేస్తున్న రాష్ట్ర గవర్నర్ను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయాల్సిందేనని డిమాండ్ చేశారు.