రాంనగర్, డిసెంబర్ 13: ఉమ్మడి కరీంనగర్ను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుతానని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కరీంనగర్ తనకు జన్మనిస్తే హుస్నాబాద్ రాజకీయంగా పునర్జన్మనిచ్చిందని వ్యాఖ్యానించారు. మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన ఆయకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఆయన వెంట మానకొండూర్ ఎమ్మెల్యే, ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నాయకులు వొడితల ప్రణవ్బాబు, పురుమల్ల శ్రీనివాస్, సిటీ కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, రత్నాకర్రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్య ప్రసన్నరెడ్డి వెంట రాగా డప్పు చప్పుళ్లు, మేళ తాళాలతో భారీ ర్యాలీ తీశారు.
అనంతరం ఇందిరాచౌక్లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో పొన్నం మాట్లాడుతూ ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకేనని కరీంనగర్ జిల్లాకు నేను ఎంతో రుణపడి ఉంటానని, ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చిన ఉమ్మడి జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తన రాజకీయ గురువు అయిన చొక్కారావు 1973 లో రాష్ట్ర రవాణామంత్రిగా పని చేశారని, 50 ఏళ్ల తరువాత అదే మంత్రిగా ఆయన శిష్యునిగా అదే పదవిలో కొనసాగడం తన అదృష్టంగా భావిస్తానన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా శ్రీధర్బాబు, నేను మంత్రులుగా ఉన్నామని పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన ఐదుగురిని కలుపుకుని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పని చేస్తానన్నారు. అనంతరం డీసీసీ కార్యాలయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లారు.