యువత కల సాకారం కోసం వేలాది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వేస్తున్న రాష్ట్ర సర్కారు, శిక్షణకూ భరోసా ఇస్తున్నది. కోచింగ్ కోసం ఎక్కడో దూరానికి వెళ్లకుండా జిల్లాలోనే కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ కేంద్రం ఆధ్వర్యంలో గ్రూప్-1 శిక్షణ దిగ్విజయంగా నడుస్తున్నది. మొత్తం 150 మంది ఉద్యోగార్థులకు నిష్ణాతులైన ఫ్యాకల్టీ కోచింగ్ ఇస్తుండగా, అభ్యర్థులకు ఎమ్మెల్యే సంజయ్ అండగా నిలుస్తున్నారు. తన సొంత ఖర్చులతో ఉచిత భోజనంతోపాటు వసతి సౌకర్యం కల్పించగా, యువతీ యువకులు సంబురపడుతున్నారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు ధన్యవాదాలు చెబుతున్నారు.
జగిత్యాల, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా స్వరాష్ర్టాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, ఎనిమిదేండ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించింది. నీళ్లు, నిధుల విషయంలో స్వయం సమృద్ధిని సాధించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన సర్కారు, ఇటీవలి కాలంలో మరో 80వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లోని తమకు అందుబాటులో ఉన్న కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నా.. గ్రామీణ, ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని యువత ప్రైవేట్ కోచింగ్కు వెళ్లలేని పరిస్థితి. ఈ విషయాన్ని గుర్తించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాలలో బీసీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయాలని మంత్రి గంగుల కమలాకర్కు విన్నవించగా మంజూరుకు అంగీకరించారు. అయితే ఫ్యాకల్టీతో పాటు, ప్రింటెడ్ నోట్స్ను ప్రభుత్వం అందిస్తుందని, విద్యార్థులకు భోజనంతోపాటు శిక్షణ కేంద్రానికి భవనాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మంత్రి చెప్పిందే తడవుగా మధ్యాహ్న భోజనంతోపాటు సొంత ఖర్చులతో భవనాన్ని సంజయ్ కుమార్ సమకూర్చారు.
ఉద్యోగార్థులకు 60 రోజుల శిక్షణ
గ్రూప్-1తో పాటు, ఇతర గ్రూప్ పోస్టులకు సన్నద్ధమయ్యే వారి కోసం జగిత్యాల పట్టణంలోని మోతె రోడ్డులో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ సొంత భవనంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 150 మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకున్నారు. 60 రోజుల పాటు గ్రూప్-1 నాలుగు పేపర్లకు సంబంధించిన సెలబస్ను బీసీ స్డడీ సర్కిల్ నిర్దేశించిన ఫ్యాకల్టీ ద్వారా బోధిస్తున్నారు. స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రూపొందించిన గ్రూప్-1 సెలబస్ చెందిన నోట్స్ 12 పుస్తకాల రూపంలో అచ్చువేసి ఉచితంగా ఉద్యోగార్థులకు అందిస్తున్నారు. ఇంకా కోచింగ్ కోసం వచ్చే ఉద్యోగార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా ఎమ్మెల్యే అందజేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు.
గ్రామీణ ప్రాంత యువత కోసమే..
ఉద్యోగం, ఉపాధి అనేవి మనిషి జీవితంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత యువతకు ఏనాడూ సరైన సంఖ్యలో ఉద్యోగాలు లభించలేదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో సింహభాగాన్ని సీమాంధ్రవారే దక్కించుకున్నారు. తెలంగాణ ప్రాంత యువతీ యువకులకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత సీఎం కేసీఆర్ యువత కలను నెరవేరుస్తున్నారు. ఇటీవలే 80వేల కొలువులను భర్తీ చేస్తామని ప్రకటించి, గ్రూప్-1, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడంతో పట్టణ ప్రాంతంలోని వారు తమకు అందుబాటులో ఉన్న కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారు. వారికి గ్రంథాలయాలు, ఇతర సౌకర్యాలు సైతం అందుబాటులో ఉన్నాయి. కానీ, గ్రామీణ ప్రాంత యువతకు ఇలాంటివేవి అందుబాటులో లేవు. అలాంటి వారి కోసమే సెంటర్ మంజూరు చేయించా. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు భోజన వసతి కల్పించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడే కాదు రెండున్నర నెలలుగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రంలోని ఉద్యోగార్థులకు ప్రతినిత్యం, పౌష్టికాహారాన్ని అందజేశాం. ఈ స్టడీ సర్కిల్స్లో కొందరికీ ఉద్యోగాలు వచ్చినా మా లక్ష్యం నెరవేరినట్లే.
– డాక్టర్ సంజయ్కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే
విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం..
ఎమ్మెల్యే సంజయ్కుమార్ చొరవతో జగిత్యాల జిల్లా కేంద్రానికి బీసీ స్టడీ సర్కిల్ మంజూరైంది. బోధన కేంద్రంతో పాటు, వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సైతం ఎమ్మెల్యే సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. ఆయనకు ధన్యవాదాలు. ఉద్యోగార్థులకు నిపుణులైన అధ్యాపకులతో బోధన చేయిస్తున్నాం. 60రోజుల వ్యవధిలో శిక్షణ పూర్తి చేస్తాం. అన్ని సబ్జెక్టుల సెలబస్ పూర్తి చేయిస్తాం. దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి అవసరమైతే బీసీ హాస్టల్స్ల్లో వసతిని సైతం కల్పిస్తాం. శిక్షణ పొందేవారికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం.
– సాయిబాబా, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి (జగిత్యాల)
అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో బోధన..
జగిత్యాలలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రంలో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో బోధిస్తున్నారు. శిక్షణ బాగుంది. గ్రూప్స్లో ఏదో ఒక్క ఉద్యోగం కచ్చితంగా సాధిస్తాననే గట్టి నమ్మకం కలిగింది. ఉచిత స్టడీ మెటీరియల్తో పాటు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నారు. నిరుద్యోగుల కోసం ఇంత మంచి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
– ఎల్ సుమన శ్రీ, ఉద్యోగార్థి (జగిత్యాల)
సంతోషంగా ఉంది..
గ్రూప్స్ కోసం దరఖాస్తు చేసిన. కానీ ఏం చదవాలో.. ఎలా చదవాలో తెలియని పరిస్థితుల్లో జగిత్యాలలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నారని తెలిసి కాస్త రిలాక్స్ అయ్యా. రోజూ జగిత్యాలకు వచ్చి శిక్షణ తీసుకుంటున్నా. ఉచిత తరగతులతో పాటు, ఉచితంగా స్టడీ మెటీరియల్, మధ్యాహ్న భోజన సౌకర్యం కూడా కల్పించారు. పేద కుటుంబాలకు ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. చాలా సంతోషంగా ఉంది.
– మంజులత, లక్ష్మీదేవిపల్లి
దూర భారం తప్పింది..
నేను డిగ్రీ పూర్తి చేశా. ఇంతలోనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. కోచింగ్ తీసుకుందామంటే హైదరాబాద్, కరీంనగర్ లాంటి దూరప్రాంతాలకు వెళ్లాలి. దీనికి తోడు ప్రైవేట్ కోచింగ్ కేంద్రాలకు డబ్బులు చెల్లించే స్థోమత లేదు. ఎలా అని అనుకున్న. కానీ జగిత్యాలలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లో చేరిపోయా. మంచి అనుభవం కలిగిన ఫ్యాకల్టీతో బోధిస్తున్నరు. స్టడీ మెటీరియల్ ఇచ్చారు. ఉచితంగా భోజనం కూడా పెడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సెంటర్తో దూర భారం తప్పింది. ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– కే తిరుపతి, ఉద్యోగార్థి (జాబితాపూర్)