Togarrai | సుల్తానాబాద్ రూరల్, డిసెంబర్ 6 : ఎస్సీ మహిళకు ఇచ్చిన బీసీ-సీ సర్టిఫికెట్ను వెంటనే రద్దు చేయాలని తొగర్రాయి గ్రామస్తులు డిమాండ్ చేశారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని తోగర్రాయి గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళా చిలుక స్రవంతి బీసీ-సీ సర్టిఫికెట్ తీసుకొని సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేయడాన్ని నిరసిస్తూ గ్రామంలోని వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో శనివారం సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి తరలి వెళ్లారు. ఆమెకు ఇచ్చిన బీసీ-సీ సర్టిఫికెట్ను వెంటనే రద్దు చేయాలని కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ గిరికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు కర్క శంకర్ రెడ్డి, గుండ మురళి, క్యా దాసి చంద్రమౌళి, ఊట్కూరి శ్రీనివాస్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ బీసీ మహిళలకు వచ్చిన అవకాశాన్ని సర్టిఫికెట్ రూపంలో హరించడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ మహిళల హక్కులను కాల రాయాలని చూస్తున్న సర్టిఫికేట్ ను అధికారులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం సర్పంచ్ ఎన్నికల కోసమే ఈ సర్టిఫికెట్ తీసుకోవడం జరిగిందిని వారు ఆరోపించారు. అధికారులు స్పందించి బీసీ మహిళలకు న్యాయం చేయాలని కోరారు. ఎస్సీ మహిళగా ఎన్నో సంక్షేమ పథకాలు లబ్ధి పొందినట్లు చెప్పారు. సర్టిఫికెట్ రద్దు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ ఆందోళన గర్రెపల్లి సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు, నాయకులు బోయిని రాజ మల్లయ్య, సూర శ్యామ్, లతోపాటు తదితరులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బొంగోని శంకరయ్య గౌడ్ కర్క భాస్కర్ రెడ్డి ఊట్కూరు శేఖర్, బండి శంకరయ్య, పెద్ద కొమురయ్య, తిరుమల, రాధా, తార ,భూలక్ష్మితో పాటు తదితరులు పాల్గొన్నారు.