నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 29 : ఐదో రోజు బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.., శ్రీ లక్ష్మి నీ పూజలూ గౌరమ్మ.., చిత్తు చిత్తూల బొమ్మ..’ అంటూ మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు. కరీంనగర్లోని కలెక్టరేట్లో మహిళా ఉద్యోగులు, జడ్పీ కార్యాలయ ఆవరణలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక బతుకమ్మ ఆడారు. టీఎన్జీవోస్ ఫంక్షన్హాలులో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో, కేడీసీసీబీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
వీటితో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల, వాణీనికేతన్ విద్యా సంస్థలు, తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీకాలనీలోని శ్రీచైతన్య, రామకృష్ణకాలనీలోని వాగేశ్వరీ, హుజూరాబాద్ మండలం సింగాపూర్లోని కిట్స్ కళాశాల, జగిత్యాల జిల్లా మెట్పల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు విద్యా సంస్థల్లో బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. వేములవాడ ఆలయ ఆవరణలో బతుకమ్మ వేడుకలు కొనసాగాయి.