కమాన్ చౌరస్తా, సెప్టెంబర్ 28 : ఆస్ట్రియా దేశ రాజధాని వియన్నా నగరంలో తెలుగు సంఘం ఆస్ట్రియా ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. తెలంగాణ మహిళలు సంప్రదాయ వేషధారణ, తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ ఆడిపాడుతూ పూల సోయగం, సాంప్రదాయ గీతాల మాధుర్యం, ఆటల సందడితో వేదికను తెలంగాణ ఊరితనంతో నింపారు. చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ పాల్గొనడంతో పండుగ మరింత రంజుగా మారింది.
ఈ కార్యక్రమానికి భారత రాయబార కార్యాలయం ఐఎఫ్ఎస్ అధికారి నిధి ధిమన్ ముఖ్య అతిథిగా హాజరై, మహిళలతో కలిసి బతుకమ్మ చుట్టూ ఆడిపాడుతూ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విదేశాల్లోనూ భారతీయులు తమ మూలాలను మరువకుండా పండుగలు ఘనంగా జరుపుకోవడం నిజంగా అభినందనీయమని, ఇది తెలంగాణ సంస్కృతి వైభవానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గాజుల పండుగను కూడా ప్రత్యేకంగా నిర్వహించారు.
పూల వాసన, పాటల మాధుర్యం, భక్తి, ఉత్సాహం అన్ని కలసి ఆస్ట్రియాలో బతుకమ్మ సంబరాలను మరపురాని జ్ఞాపకంగా నిలిపాయి. బతుకమ్మ పూల పండుగ కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాక, మన సంస్కృతిని, మన మూలాలను ఎక్కడ ఉన్నా మనతోనే ఉంటాయని గుర్తు చేసే ఆధ్యాత్మిక చిహ్నమని ప్రవాస భారతీయులు సంతోషం వ్యక్తం చేశారు.