ఆరోగ్య తెలంగాణ కోసం అహర్నిశలూ కృషిచేస్తున్న రాష్ట్ర సర్కారు, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రజలకు మెరుగైన వైద్యం కోసం దవాఖానల్లో వసతులు కల్పిస్తున్నది. కొత్తగా పట్టణాల్లో స్థానికంగానే చికిత్స అందించేందుకు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ మేరకు జిల్లాలోని రామగుండం నగరంలో రెండు, పెద్దపల్లి పట్టణంలో రెండు చొప్పున నాలుగు వైద్యశాలలు నెలకొల్పుతున్నది. ఇప్పటికే రామగుండంలో పీకే రామయ్య కాలనీ, కాజుపల్లిలో రెండు దవాఖానలు ప్రారంభమై, అందుబాటులోకి రావడం, తమ కాలనీలోనే సత్వర ట్రీట్మెంట్ అందుతుండడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
పెద్దపల్లి, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ): పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్యసేవల విస్తర్ణణకు, మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బల్దియాల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. పట్టణాల్లో ప్రధాన దవాఖానలు, యూపీహెచ్సీలు ఉన్నప్పటికీ దూరభారం అవుతుండడంతో స్థానికంగానే వైద్యం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్లో రెండు, పెద్దపల్లి మున్సిపాల్టీకి రెండు చొప్పున మొత్తం నాలుగు దవాఖానలు మంజూరు చేసింది. వైద్యులు, నర్సులు, సూపర్వైజర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలను కేటాయించింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే రామగుండం కార్పొరేషన్లో పీకే రామయ్య కాలనీ, ఖాజీపల్లిలో రెండు దవాఖానలు ప్రారంభించి, వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. జిల్లా కేంద్రానికి మంజూరైన దవాఖానల కోసం ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను పరిశీలిస్తున్నారు. వీలైనంత త్వరగా సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
చేరువకానున్న వైద్యం..
రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల వైద్యసేవలను ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. పేద కుటుంబాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే వీటిని నిర్మిస్తున్నది. ఈ దవాఖానలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఏ అనారోగ్య సమస్య వచ్చినా తక్షణమే వైద్యం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రాథమిక దశలోనే వ్యాధుల గుర్తింపు, వైద్య సేవలు అందడంతో పేదలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రైవేటు దవాఖానల్లో వేలాది రూపాయలు ఖర్చు చేసే బాధ తప్పుతుంది. కాగా, అనారోగ్యానికి గురై దవాఖానకు వచ్చిన వ్యక్తికి మొదట ప్రాథమిక వైద్య సేవలందించి ఉచితంగా మందులు అందజేస్తారు. అత్యవసరమైతే దగ్గరలోని పట్టణ ఆరోగ్య కేంద్రం, జిల్లా దవాఖాన, అవసరమైతే హైదరాబాద్లోని వైద్యశాలలకు వైద్యులు రిఫర్ చేస్తారు.
త్వరలోనే సేవలు ప్రారంభిస్తాం..
పట్టణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం జిల్లాకు నాలుగు బస్తీ దవాఖానలు మంజూరు చేసింది. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని పీకే రామయ్య కాలనీ, ఖాజీపల్లిలో ఇప్పటికే దవాఖానలు ప్రారంభించాం. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో మరో రెండు ఏర్పాటు చేసేందుకు అనుమతి వచ్చింది. ఆయాచోట్ల ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల కోసం పరిశీలిస్తున్నాం. త్వరలోనే వైద్యశాలలు ప్రారంభించి సేవలను అందుబాటులోకి తెస్తాం.
– డా. ప్రమోద్కుమార్, డీఎంఅండ్హెచ్వో, పెద్దపల్లి.