కరీంనగర్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/సిరిసిల్ల : ఈ నెల 24న సెస్ ఎన్నికలు జరగనున్నాయి. సెస్ పరిధిలోని 15 డైరెక్టర్ స్థానాలకు పోటీ పడుతున్న వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల నుంచి వస్తున్న మద్దతును దృష్టిలో పెట్టుకొని.. బీజేపీ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురువారం సిరిసిల్ల, వే ములవాడ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. అయితే ఆ రెండుచోట్లా ఆయన చేసిన ప్రసంగం పచ్చి అబద్ధాలతో సాగింది.
‘చిన్నపాటి సెస్ ఎన్నికల్లోనూ మం త్రులు, ఎమ్మెల్యేలను ఇన్చార్జీలుగా నియమించారని, ఓటుకు 5వేల నుంచి 10 వేలు వెదజల్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందని, సెస్లో పొరపాటున బీఆర్ఎస్ను గెలిపిస్తే సెస్కు ఇవే ఆఖరు ఎన్నికలు అవుతాయని, సెస్ను ఎలక్ట్రిసిటీ బోర్డులో కలిపేస్తారంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న నన్ను చెప్పుతో కొడతానని కేటీఆర్ అంటున్నాడని, సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే.. సెస్ సమస్యలను పరిష్కరించాలని వెళ్తే మిమ్ముల్ని కూడా చెప్పుతో కొడతానంటాడు’అని నోటికి ఇష్టంవచ్చినట్లు మోసపూరితంగా మాట్లాడారు.
నీ ప్రచారం ఎందుకు?
సిరిసిల్ల సెస్ ఎన్నికలు చిన్నవే అయితే.. ఒక రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో నువ్వేందుకు రోజంతా ప్రచారం చేశావో చెప్పాలని విభిన్న వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అంతేకాదు, ఎమ్మెల్యేలు, మంత్రులను బీఆర్ఎస్ ఇన్చార్జీలుగా పెట్టిదంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. నిజానికి ఇన్చార్జీలను పెట్టింది బీజేపీ పార్టీయే. అంతేకాదు, డబ్బుల ఆశ చూపిస్తూ .. ఓటర్లను ప్రలోభపెట్టాలని చూస్తున్నదీ ఆ పార్టీనేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిజానికి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు స్వరాష్ట్రంలో మంత్రి కేటీఆర్ సెస్ పరిధిలో చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నారు. కండ్ల ముందు కనిపిస్తున్న ప్రగతిని వివరిస్తున్నారు. కానీ, బీజేపీ అభ్యర్థులకు ఆ వాయిస్ లేదు. ఎంపీగా బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఒక్కటంటే ఒక్క పనీ చేయలేదు. కేంద్రం నుంచి టెక్స్టైల్ పార్కు తేవడంలో విఫలమయ్యారు. అలాగే కేంద్రాన్ని ఒప్పించి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిధులు తేలేకపోయారు. వీటిపై సమాధానం చెప్పలేని బండి.. ఇప్పుడు ఆ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులకు ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలను పక్కదారి పట్టించేందుకు అసత్య ఆరోపణలకు దిగుతున్నారు.
సెస్ను ఎలక్ట్రిసీటీ బోర్డులో కలుపుతారంటూ ఆధారంలేని ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి ఆ పనిచేయాలనుకుంటే.. గడిచిన ఎనిమిదేళ్ల కాలంగా సెస్లో వెలుగులు నింపడానికి కేటీఆర్ ఎందుకు ప్రయత్నం చేస్తారన్న దానికి బీజేపీ వద్ద సమాధానం లేదు. అబద్ధాల బండి అని చెప్పడానికి మరో పచ్చి నిదర్శనం ఆయన గురువారం చెప్పిన మరో మాట! ‘ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న నన్ను చెప్పుతో కొడతానని కేటీఆర్ అంటున్నాడు. సెస్ సమస్యలను పరిష్కరించాలని అడిగితే మిమ్మల్ని కూడా చెప్పుతో కొడుతానంటాడు’ అంటూ తన ప్రసంగంలో విషంగక్కారు. డ్రగ్స్ వాడుతున్నాడని, శాంపిల్స్ ఇవ్వాలంటూ బండి చేసిన సవాలు స్వీకరించి కేటీఆర్ ఇటీవల మాట్లాడారు. శాంపిల్స్ కోసం వెంట్రుకలే కాదు.. అవసరమైతే కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమని, డ్రగ్స్ వాడుతున్నట్లుగా తేలకపోతే.. కరీంనగర్ చౌరస్తాలో చెప్పుతో కొట్టుకుంటువా బండి అంటూ సవాల్ విసిరారు. ఎక్కడ కూడా చెప్పుతో కొడుతాను అనే మాట మాట్లాడలేదు. కానీ, సింపతి కోసం బండి సంజయ్ ఎంతకైనా దిగజారుతున్నాడనేందుకు ఇదే నిదర్శనం. అనని మాటలు అన్నట్లుగా చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేసి విద్వేషం నింపాలని చూశారు. కానీ, బండి మాట్లాడిన తీరుపై ఆయన పార్టీ వాళ్లే ముక్కున వేలేసుకున్నారు. నిజానికి ఏ పార్టీ అధ్యక్షుడైనా ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తే.. ఇప్పటివరకు చేసింది, భవిష్యత్లో చేసేది చెప్పాలి. కానీ, సెస్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఏమి చేస్తారో చెప్పకుండా.. అబద్ధపు ప్రచారాలు, మోసపూరిత మాటలతోనే ఆయన తన ప్రచారం చివరివరకు సాగడంపై స్థానికులు భగ్గుమన్నారు.
కరంట్ కోసం సంజయ్ ఏం సేసిండు?
గతంలో పొలం కాడ కరెంటు ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెల్వకపోతుండె. మస్తు ఇబ్బంది అయితుండె. ఎంతో మంది రైతులు కరెంటు పెట్టడానికి వెళ్లి విష పురుగుల బారిన పడి చనిపోయిన్రు. మంత్రి కేటీఆర్ చొరవతో ఇప్పుడు వ్యవసాయం పండుగలా మారింది. 24 గంటలు కరంటు ఇస్తున్నరు. కరెంట్ బాధ పోయింది. పంటలకు నీళ్ల బాధ కూడా తప్పింది. ఇంత మంచిగ కరంటు ఉండి పంటలు పండించుకుంటుంటే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విద్యుత్ సమస్యపై మాట్లాడడం చిత్రంగా ఉంది. అసలు కరంట్ కోసం బండి సంజయ్ ఏం చేసిండో చెప్పాలి.
– ఏ లక్ష్మీనారాయణ, రైతు (ఎల్లారెడ్డిపేట)
కరంట్ తిప్పలు తప్పినయ్
నేను పదిహేనేళ్లుగా వివిధ వ్యాపారాలు చేస్తున్న. గతంలో విద్యుత్ సమస్యతో మస్తు ఇబ్బందులు పడ్డం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. మంత్రి కేటీఆర్ సెస్పై ప్రత్యేక దృష్టి సారించి విద్యుత్ కోతలు లేకుండా చేసిండు. ఇప్పుడు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతున్నది. గతంలో సిరిసిల్ల ప్రగతినగర్లో లో ఓల్టేజీ సమస్యతో దుకాణంలోని ఎలక్ట్రానిక్ పరికరాలు దగ్ధమైన సంఘటనలు ఎన్నో ఉన్నయ్. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవు. ఆనందంగా వ్యాపారం చేసుకుంటున్నం.
– ఎన్ రమేశ్ వ్యాపారి (సిరిసిల్ల)
బండి ఆరోపణలు హాస్యాస్పదం
సమైక్య పాలనలో ముస్తాబాద్లో సెస్ భవనం శిథిలావస్థకు చేరింది. పెచ్చులూడి ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉండేది. భవన పరిస్థితిని చూసి మంత్రి కేటీఆర్ నూతన కార్యాలయాన్ని మంజూరు చేసి ప్రారంభించిండు. ఇప్పుడు కొత్త భవనంలో సేవలందుతున్నయ్. గత యాభై ఏళ్లుగా జరగని అభివృద్ది ఎనిమిదేళ్లలో జరుగుతున్నది. సెస్పై బండి సంజయ్ ఆరోపణలు చేయడం నవ్వు తెప్పిస్తున్నది. కరంటు కోసం మంత్రి కేటీఆర్ చేస్తున్నట్లు ఇదివరకు ఎవరూ చేయలె.
– ఎల్సాని దేవయ్య, ముస్తాబాద్
వ్యాపారులమందరం రుణపడి ఉంటం
గతంల ఎప్పుడూ కరెంట్ సరిగా ఉండేది కాదు. సరఫరాలో అంతరాయం ఏర్పడి సామగ్రి అంతా కాలిపోయేది. చాలా ఇబ్బందవుతుండె. తెలంగాణ ఏర్పాటు తర్వాత సెస్ ద్వారా నాణ్యమైన కరెంటు ఇస్తున్నరు. 24 గంటలు కరెంట్ ఉంటున్నది. ఇప్పుడు కరంటు సమస్యలు లేవు. వ్యాపారాలు కూడా సజావుగా సాగుతున్నయ్. మంత్రి కేటీఆర్కు వ్యాపారులందరం రుణపడి ఉంటం.
– బూర గురుమూర్తి, వ్యాపారి, సిరిసిల్ల
ట్రాన్స్ఫార్మర్ల లొల్లి పోయింది
తెలంగాణ రాకముందు ట్రాన్స్ఫార్మర్ల కోసం అరిగోస పడేది. ట్రాన్స్ఫార్మర్లు ఎప్పుడూ కాలిపోతుండె. కరంటోళ్ల చుట్టు తిరిగినా జల్దికాకపోతుండె. మంత్రి కేటీఆర్ సెస్ను మంచిగా చే సిండు. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ల లొల్లి పోయింది. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని హెల్పర్కు చెప్పగానే గంటల్లో ఫిట్ జేసి పోతున్రు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు మంచి జేసినోళ్లను తిట్టుడు బీజేపోళ్లకు అలవాటైంది. కరంటు గిట్ల ఎల్లకాలం ఉంటుందని నేనైతె అనుకోలె. పంటలు మంచిగ పండి అందరం సంతోషంగ ఉన్నం.
– నేవూరి మైసిరెడ్డి, రైతు (గంభీరావుపేట)