కరీంనగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు భారీ పరిశ్రమను తీసుకురావడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. గతంలో ఒక్కరు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు లేవని, అలాంటిది తనకు హ్యాట్రిక్ విజయాన్నందించిన నియోజకవర్గ ప్రజల కోసం మరింత అభివృద్ధి చేసి వారి రుణం తీర్చుకుంటానని తెలిపారు. ఆత్మీయ పలుకరింపుల కోసమే సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని, బీఆర్ఎస్ కార్యకర్తలే తన బలం.. బలగమని చెప్పారు. ఈ మేరకు గురువారం చింతకుంటలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కొత్తపల్లి మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు.
– కొత్తపల్లి, ఏప్రిల్ 6
కొత్తపల్లి, ఏప్రిల్ 6 : బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ పలుకరింపుల కోసమే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేశారని, కార్యకర్తలే మా బలం.. బలగమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ నియోజకవర్గ చరిత్రలో ఒకసారి గెలిచిన వ్యక్తి మరోసారి ఎమ్మెల్యేగా గెలవలేదని, అలాంటిది మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయాన్ని ఇచ్చిన ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కస్తూ.. రుణపడి ఉంటానని ఉద్వేగభరితంగా చెప్పారు. యువతకు ఉద్యోగం, ఉపాధి కోసం కరీంనగర్కు భారీ పరిశ్రమను తీసుకు వస్తానని హామీనిచ్చారు. చింతకుంటలోని ఓ ఫంక్షన్హాల్లో గురువారం నిర్వహించిన కొత్తపల్లి మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకం ఉంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా మరింత కష్టపడి పనిచేసి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధిలో ముందుంచుతానన్నారు. తనను ఇంతలా ఆదరిస్తున్న కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదేనన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు తనకు గ్రానైట్ ఫ్యాక్టరీలున్నాయని, గెలిస్తే నీళ్లన్నీ వాటికే తీసుకుపోతాడని అసత్య ప్రచారాలు చేశారని, ఇన్నేళ్లలో ఏనాడైనా, ఏ ఊరికైనా తాగు, సాగు నీరు పెరిగాయా..? లేదా తగ్గాయా..? వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. తానెప్పుడూ గెలవడం కోసం ఏది పడితే అది మాట్లాడనని, ప్రజల సంక్షేమం, నగర ఆభివృద్ధే తన ధ్యేయమని స్పష్టం చేశారు. పదవి ఉన్నా లేకున్నా ఒకటే విధంగా ఉంటానని, కౌన్నిలర్గా ఎలా ఉన్నానో మంత్రిగా అలాగే ఉన్నానన్నారు. ఒకప్పుడు కల్లోల కరీంనగర్గా పేరున్న నగరం ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంతో సినీ ఇండస్ట్రీయే ఇక్కడికి తరలివచ్చి వేడుకలు జరుపుకుంటున్నదని, దీనికి ఇటీవల బలగం, దసరా మూవీలే నిదర్శనమన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ, వేంకటేశ్వర టెంపుల్, సెంటర్ల బ్యూటిఫికేషన్, కేబుల్ బ్రిడ్జి, మానేర్ రివర్ ఫ్రంట్తో అద్భుత నగరంగా మారిందన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఒకవైపు, కళోత్సవాలు మరోవైపు అదనంగా విజయోత్సవాలు జరుపుకుంటూ అన్నిరంగాల్లో దూసుకుపోతున్నదని చెప్పారు. హైదరాబాద్లోని ఔటర్రింగ్ రోడ్డు తర్వాత 19 కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ ఏర్పాటైందని కరీంనగర్లోనేని స్పష్టం చేశారు.
కేసీఆర్ సారథ్యంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి సమస్య పరిష్కారమైందని తెలిపారు. కొత్తపల్లి మండలంలో ఎకరానికి లక్ష కూడా పలకని పరిస్థితుల నుంచి నేడు పుష్కలమైన నీరు, పంటల సాగుతో ఎకరాకు 12 కోట్ల నుంచి 15 కోట్లకు చేరిన తర్వాత భరోసా దొరికిందని చెప్పారు. 24 గంటల ఉచిత కరెంట్, కాళేశ్వరం జలాలు, పెట్టుబడి సాయం కారణంగా తెలంగాణాలో భూమికి భారమయ్యేలా పంటలు పండుతున్నాయని, పచ్చగా ఉన్న తెలంగాణను చూసి ఓర్వలేక ఢిల్లీ పెద్దలు కుట్రల చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో జడ్పీటీసీ పిట్టల కరుణ, సర్పంచ్లు జినుక సంపత్, రాచమల్ల మధు, ఉల్లెందుల రాజమ్మ, ఎల్దండి షర్మిల, కడారి శాంత శ్రీనివాస్, గొట్టె పోచయ్య, ఎంపీటీసీలు భూక్యా తిరుపతినాయక్, పట్టెం శారద లక్ష్మీనారాయణ, దావ కమల మనోహర్, పండుగ గంగవ్వ నర్సయ్య, మంద రమేశ్గౌడ్, మండల కోఆప్షన్ సభ్యుడు షరీఫ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, సీనియర్ నాయకుడు పిల్లి మహేశ్ బర్త్ డే సందర్భంగా మంత్రి గంగుల కేక్ కట్ చేసి స్వీట్ తినిపించారు.
కనుల పండుగలా సమ్మేళనాలు
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఆత్మీయ సమ్మేళనాలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. చాలా సంతోషం. చింతకుంట ఆత్మీయ సమ్మేళనంలో ప్రతి కార్యకర్తా గులాబీ కండువా ధరించి పాల్గొనడం ఆనందంగా ఉన్నది. కరీంనగర్ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు కొత్తకాదు. మంత్రి గంగుల కమలాకర్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం ప్రారంభించినా కార్యకర్తలకు భోజనాలు పెట్టించి ఆత్మీయంగా పలుకరిస్తారు. వాటినే ఇప్పడు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనంగా చేస్తుండడం శుభపరిణామం. ఎన్నికల సందర్భంలో ఇవ్వని ఎన్నో హామీలను మంత్రి గంగుల కమలాకర్ తీర్చారు. మానేరు రివర్ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి, పద్మనగర్ నుంచి ఒద్యారం వరకు సెంట్రల్ లైటింగ్ వంటి అభివృద్ధి అందుకు నిదర్శనం.
భారీ విజయాన్ని అందించాలి
ప్రజాక్షేత్రంలో మంత్రి గంగుల కమలాకర్ వంటి బలమైన నాయకుడు మరొకరు లేరు. కరీంనగర్ నియోజకవర్గానికి ఆయన ఆరాధ్యదైవం. సీఎం కేసీఆర్ను ఒప్పించి వందల కోట్ల రూపాయాలతో నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశా రు. పార్టీలో పనిచేసే అందరికీ పదవులు ఇవ్వాలంటే ఎవ్వరికి సాధ్యంకాదు. ప్రతి కార్యకర్తను ఆదరించి అక్కున చేర్చుకొనే నాయకుడు మనకు ఉండడం మండల వాసులుగా గర్వించాలి. ప్రతి నాయకు డూ గంగుల కమలాకర్కు వంద ఓట్లు వేయించి నాలుగోసారి భారీ విజయాన్ని అందించాలి.
– కాసారపు శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు (కొత్తపల్లి)
మన పథకాలు మరెక్కడా లేవు
మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సైతం మన పథకాలను అమలు చేయలేకపోతున్నారు. బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఆత్మీయ స మ్మేళనాలతో నాయకులు, కార్యకర్త ల్లో మరింత ఉత్సాహం నిండుతున్నది. ఇ లాంటి ఆత్మీయ సమ్మేళనాలు ప్రతి గ్రామంలో నిర్వహిస్తే బాగుంటుంది. ఉచితంగా 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా మనదే. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి చేరింది. పల్లెల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కోసం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి.
– పిల్లి శ్రీలత మహేశ్గౌడ్, ఎంపీపీ (కొత్తపల్లి)
తెలంగాణను అస్థిర పరిచే కుట్రలు
మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీల్లో తాగునీటి కోసం ఇప్పటికీ అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. చత్తీస్గఢ్ ప్రభుత్వం రైతులు పండించిన ఒక్క పంటనే కొనుగోలు చేస్తున్నది. కానీ, తెలంగాణలో రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటున్నది. పచ్చని తెలంగాణను చూసి ఓర్వలేక అస్థిర పరిచేందుకు టీఎస్సీపీఎస్సీ, పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ చేస్తూ అల్లోకల్లోలం సృష్టిస్తున్నారు. పాదయాత్ర పేరిట ఆంధ్రా నుంచి ఒకరు, ఓటుకు నోటు కేసులోని వ్యక్తి మరొకరు, పేపర్ లీకేజీ మనిషి మరొకరు దండయాత్ర చేస్తున్నారు. పొరపాటున అధికారం వారి చేతుల్లోకి వెళ్తే కాళేశ్వరం నుంచి ఆంధ్రాతోపాటు ఇతర రాష్ర్టాలకు నీళ్లను తరలిస్తారు. మన ఎప్టీసీసీ కరెంటును ఎత్తుకు పోతారు. హైదరాబాద్ ఆదాయంలో సైతం వాటా అడుగుతారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే పార్టీ ఎజెండాలో తెలంగాణ ఉండదు. మన గల్లీలో ఉన్నవాళ్లే మన ఎజెండాతో బాగోగులు చూస్తారు. మన తాత, తండ్రుల నుంచి కష్టపడుతున్న మనం ఇకనైనా మన బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్న కేసీఆర్కు మరింత బలాన్ని అందించి కాపాడుకోవాలి.
– మంత్రి గంగుల కమలాకర్
కార్యకర్తలకు కొండంత అండ
బీఆర్ఎస్ కార్యకర్తలకు కొండంత అండ మంత్రి గంగుల కమలాకర్. ఆయన ఎమ్మెల్యేగా ఉండడంతోనే నియోజకవర్గంలోని ప్రతి నాయకుడు, కార్యకర్త ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్తున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి పెండింగ్లో ఉన్న సమస్యలను కేవలం ఎనిమిదేండ్లలోనే పరిష్కరించారు. ఆయన పేరు అభివృద్ధికి కేరాఫ్గా మారింది. మండలంలోని చెరువులు మండుటెండలో సైతం మత్తడి దుంకుతుండడం మంత్రితోనే సాధ్యమైంది. నియోజకవర్గంలో మంత్రి గంగుల కమలాకర్ను తప్ప మరో నాయకుడిని ఊహించే పరిస్థితి లేదు. ఇవాళ గ్రామాల్లో చెప్పుకుందామంటే సమస్యలు కనపడడం లేదు. అడగకుండానే అన్ని చేసిన నాయకుడు ఆయన.
– సోమినేని తిరుపతి, సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు (ఖాజీపూర్)