గంగాధర : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ( Bandi Sanjay ) ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ గడ్డపై రౌడీయిజాన్ని ( Rowdyism ) పెంచి పోషిస్తున్నాడని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు ( Naveen Rao ) ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ గూండాలు దాడి చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో ధర్నా ,రాస్తారోకో నిర్వహించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ గూండాల దాడి అమానుషమైన చర్యని దుయ్యబట్టారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, హుందాగా రాజకీయాలు చేయాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకే రక్షణ లేదని, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బండి సంజయ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ద్యావ మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్ రావు, కాసారం సర్పంచ్ వేముల దామోదర్, నాయకులు రామిడి సురేందర్, ఆకుల శంకరయ్య, ఎండి నజీర్, జోగు లక్ష్మీరాజం, వడ్లూరి ఆదిమల్లు, గడ్డం స్వామి, బొల్లాడి శ్రీనివాసరెడ్డి, పుట్కం రవీంద్రనాథ్ ఠాగూర్, గర్వందుల పరుశరాములు, పొన్నం రాములు, మామిడిపల్లి అఖిల్, జలంధర్ రెడ్డి, బొల్లాడి అనంతరెడ్డి, నల్ల నరోత్తం రెడ్డి, నరుకుల్ల గంగయ్య, తూము మల్లారెడ్డి, లింగాల దుర్గయ్య, దోమకొండ మల్లయ్య, గంగాధర మోహన్ తదితరులు పాల్గొన్నారు.