త్వరలో జరిగే లోక్సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సన్నద్ధమైంది. అందులో భాగంగా కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ వినోద్కుమార్ను తిరిగి బరిలోకి దింపుతుండగా, పెద్దపల్లి నుంచి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు అవకాశమిచ్చింది. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణభవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీరిద్దరి పేర్లను రెండు నియోజకవర్గాల నాయకులు ఏకగ్రీవంగా ఆమోదించగా.. సోమవారం ప్రకటించే అవకాశమున్నది. దీంతోపాటు ఈనెల 12న కరీంనగర్ గడ్డపై నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించడంతో బీఆర్ఎస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, మార్చి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాబోయే లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతున్నది. ఈ దిశగా అధినేత కేసీఆర్ ఇప్పటికే వ్యూహాలకు పదును పెడుతుండగా.. తాజాగా అభ్యర్థులను పేర్లను ఖరారుపై దృష్టి సారించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్యక్షతన కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. అందరి ఆమోదం మేరకు.. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ వినోద్కుమార్, పెద్దపల్లి నుంచి సీనియర్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ను బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఆ మేరకు పేర్లను వెల్లడించారు. కానీ, అధికారికంగా సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. ఇటు వినోద్కుమార్, అటు కొప్పులను బరిలోకి దింపడం వెనుక పార్టీ భారీగానే కసరత్తు చేసినట్లు కనిపిస్తున్నది. నిజానికి వీరిద్దరూ మచ్చలేని మనుషులు, వివాదరహితులు, ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన నాయకులు. అంతేకాదు, బీఆర్ఎస్ ఆవిర్భావం (2001) నుంచి నేటి వరకు పార్టీ కోసం పనిచేయడమే కాకుండా.. అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చారు. రాజకీయాల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలతోనే మమేకమవుతూ వస్తున్నారు.
ఒక సాధారణ కుటుంబంలోపుట్టి.. సింగరేణి ఉద్యోగిగా రిజైన్ చేసి రాజకీయాల్లోకి ప్రవేశించిన కొప్పుల ఈశ్వర్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 2001నుంచి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలుస్తూ.. పార్టీకి విధేయుడిగా పనిచేసిన ఆయన 2004 నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. వరుస విజయాలతో ప్రస్థానం కొనసాగించి, అనేక బాధ్యతలను నిర్వర్తించారు. మంత్రిగానే కాదు, బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కమిటీ సభ్యుడిగా, చీఫ్ విప్ వంటి ఎన్నోపదవులను అలంకరించారు. ప్రతి పదవికీ న్యాయం చేకూర్చడమే కాకుండా.. వివాదరహితుడిగా పేరు సంపాదించారు. మంత్రిగా ఉన్నా.. లేదా ఇతర పదవుల్లో ఉన్నా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ వచ్చారు. ఉమ్మడి జిల్లాలోనే మంచి పేరు పొందారు. ఒకప్పుడు విప్లవోద్యమాల్లో చురకైన పాత్ర పోషించిన కొప్పుల, ప్రత్యేకంగా పెద్దపల్లి జిల్లాలో కార్మికులతో మంచి సంబంధాలు కొనసాగించారు. సింగరేణి కార్మికుల సమస్యలను అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. నిగర్విగా, వివాదరహితుడిగా పేరు సంపాదించిన కొప్పులకు బీఆర్ఎస్ అధినేత అనేక రకాలుగా అవకాశాలు కల్పిస్తూ వచ్చారు. ప్రజా సేవపై అంకితభావం, సింగరేణి కార్మికులపై అవగాహన వంటివి పరిగణలోకి తీసుకొని, తాజాగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కొప్పులను బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ భవన్ వేదికగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. నాయకులకు రాబోయే ఎన్నికలే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. నాయలెవ్వరూ అధైర్య పడొద్దని భరోసానివ్వడమే కాకుండా.. పార్టీ శ్రేణులు అంతా కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని నిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనను ప్రజలు గమనించారని, ఇదే సమయంలో వందరోజుల కాంగ్రెస్ పాలనను చూస్తున్నారని, ప్రజలు అన్నింటినీ బేరీజు వేసుకుంటారని, వాస్తవాలను గమనిస్తున్నారని చెప్పారు. అయితే మనం ఓటమి పాలైనా.. ప్రజల పక్షాన నిలబడి పోరు చేయాలని చెప్పారు. ఎన్నికల్లో భాగంగా ఈ నెల 12న కరీంనగర్లోభారీ బహిరంగ సభను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కలిసి వచ్చే ఎస్సారార్ కళాశాల వేదికగా కరీంనగర్ కదనభేరి పేరిట సభను నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ సభా వేదిక ద్వారానే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం చుట్టనుండగా, సభను విజయవంతం చేసేందుకు నాయకులు అప్పడే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
పుట్టిన తేదీ : 1959 జూలై 22
స్థలం : కరీంనగర్
తల్లిదండ్రులు : సుగుణదేవి, మురళీధర్రావు
భార్య : బీ మాధవి, ప్రముఖ వైద్యురాలు
కొడుకులు : డాక్టర్ ప్రతీక్, ప్రణయ్
చదువు : డిగ్రీ, ఎల్ఎల్బీ (కాకతీయ విశ్వవిద్యాలయం)
వృత్తి : 1998 వరకు న్యాయవాదిగా హైకోర్టు, వరంగల్ జిల్లా కోర్టుల్లో పనిచేశారు. బార్ కౌన్సిల్ సభ్యుడిగా, అడ్వకేట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగా కొనసాగారు. 1998 నుంచి 2001 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసులు వాదించారు.
చదువుకునే రోజుల్లో విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేశారు. ఆలిండియా స్టూడెంట్ ఫెడరేషన్లో వివిధ పదవులు అలంకరించారు. సీపీఐ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శిగా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. తర్వాత కేసీఆర్తో కలిసి పనిచేశారు. బీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా 32 పార్టీలను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించారు. యూపీఏ తెలంగాణపై కనబరిచిన వైఖరికి నిరసగా 2008లో కేసీఆర్తో కలసి రాజీనామా చేశారు. 2004 నుంచి 2009 వరకు హనుమకొండ పార్లమెంట్ నియోజకవర్గ (14వ లోక్సభ) ఎంపీగా కొనసాగారు. 2014 నుంచి 2019 వరకు కరీంనగర్ ఎంపీగా (16వ లోక్సభ) కొనసాగారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందారు. 2019 ఆగస్టు 16 నుంచి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు పనిచేశారు. ప్రస్తుతం కరీంనగర్ లోక్సభ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.
హనుమకొండ, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన వినోద్కుమార్ లోక్సభలో సత్తా చాటారు. అంతకు ముందు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తేవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పుడు తెలంగాణ విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చూపితే.. నిరసగా ఎంపీ పదవికి రాజీనామా చేసి తిరిగి గెలిచారు. కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధిపై వినోద్కుమార్ చెరగని ముద్ర వేశారు. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ విషయంలో చూపిన చొరవ అంతా ఇంతా కాదు. ప్రధానితో శంకుస్థాపన చేయించే వరకు ఆయన పట్టువదలేదు. అంతేకాదు, 2019 ఎన్నికల్లో ఓడిపోయినా ఈ లైన్ గురించి.. ఎంతోమంది కేంద్ర మంత్రులకు లేఖలు రాస్తూ.. ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. చాలా రైళ్ల విషయంలోనూ ఆయన విజయం సాధించారు. కరీంనగర్ చుట్టూ జాతీయ రహదారులను సాధించడమే కాదు, జాతీయ రహదారుల అభివృద్ధి కోసం కరీంనగర్ కేంద్రంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. నిబంధనలు ఒప్పుకోకపోయినా కరీంనగర్కు స్మార్ట్సిటీ సాధించగా, ఈ ప్రాజెక్టు ఫలాలు ప్రస్తుతం ప్రజల కండ్లముందు కనిపిస్తున్నాయి. ఇటు విద్యారంగం అభివృద్ధి కోసం విశేష కృషి చేశారు. ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు కరీంనగర్ ఎంపీగా ఆయన చేసిన ప్రసంగాలు, సూచనలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. పార్లమెంట్ సాక్షిగా ఎన్నో అంశాలపై ఆయన గళమెత్తిన తీరు, సంధించిన ప్రశ్నలు అందరికీ స్ఫూర్తినిచ్చాయి. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడిగా సమర్థవంతంగా పని చేయడమే కాకుండా, ఐదేళ్లలో 540 ప్రశ్నలు సంధించిన ఎంపీగా చరిత్ర సృష్టించారు. ప్రశ్నలు సంధించడంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచారు. అలాగే 106 అంశాలపై చర్చల్లో పాల్గొని అత్యధిక చర్చల్లో పాల్గొన్న ఎంపీగా రికార్డు నమోదు చేశారు. విషయ పరిజ్ఞానం, తన ప్రాంతానికి మేలు చేయాలన్న తపన, సాధించే వరకు అలుపెరగకుండా శ్రమించడం ఆయన నైజం. ఇవేకాదు, అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని ఈసారి కూడా వినోద్కుమార్ను బీఆర్ఎస్ బరిలోకి దింపుతున్నది. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
పుట్టిన తేదీ : 20 ఏప్రిల్ 1959
తల్లిదండ్రులు : లింగయ్య- మల్లమ్మ
స్వస్థలం : కుమ్మరికుంట, జూలపల్లి మండలం, పెద్దపల్లి జిల్లా
భార్య : స్నేహలత, ఎల్ఎమ్ కొప్పుల ట్రస్ట్ అధ్యక్షురాలు
కూతురు, అల్లుడు : నందిని-అనిల్
చదువు : డిగ్రీ (బీఏ)
ఉద్యోగం : 1976లో సింగరేణిలో కోల్కట్టర్. 1977 నుంచి విప్లవోద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. కార్మికుల పక్షాన పోరాటం చేస్తూనే రాజకీయాల వైపు మళ్లారు.
1983లో టీడీపీలో చేరారు. మిడ్క్యాప్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. 1994లో మొదటిసారి మేడారం రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2001లో బీఆర్ఎస్లో చేరారు. 2004 ఎన్నికల్లో మేడారం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి సమీప టీటీపీ అభ్యర్థి మాల మల్లేశంపై 56,563 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 2008 తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు పార్టీ శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం నిర్వహించిన ఉపఎన్నికల్లో పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 28,137 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009 సాధారణ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ధర్మపురి నియోజకవర్గం కొత్తగా ఏర్పడి ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో అప్పటి నుంచి ఈ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్నారు. 2009, 2010, 2014, 2018లో వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. 2014 నుంచి 2018 వరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో బీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 నుంచి 2023 వరకు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రిగా ఉన్నారు. 2023 శానసభ ఎన్నికల్లో ఓటమి చెందారు. 2024 పెద్దపల్లి లోకసభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు.