హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ఈ నెల 24 నుంచి ట్రాన్స్పోర్ట్ జేఏసీ తలపెట్టిన నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం స్పందించి ట్రాన్స్పోర్ట్ జేఏసీ నాయకులతో చర్చలు జరిపి, లక్షలాది మంది డ్రైవర్ల కుటుంబాలకు భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పులు చేసి వాహనాలు కొనుగోలు చేసిన డ్రైవర్లు, పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలతో కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఆదుకునేలా ఇన్సూరెన్స్, 50 ఏండ్లు దాటిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.