కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 22 : ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన మొండి బకాయిల వసూళ్లపై నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం ఒక్క రోజే రూ.86 లక్షల ఆస్తి పన్ను వసూలు చేశారు. ఆర్టీసీ వర్క్షాపునకు సంబంధించి 2014 నుంచి ఆస్తి పన్ను రూ.1,80,76,591 బకాయి ఉండగా, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆర్టీసీ అధికారులతో మాట్లాడి చెల్లింపు విషయంలో ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అందించిన వడ్డీ మాఫీ పథకాన్ని పరిగణలోకి తీసుకొని ఆర్టీసీ అధికారులు రూ.86,07,972 చెక్కు అందించారు. కాగా, వివిధ ప్రభుత్వ సంస్థల కార్యాలయాల నుంచి రూ.22 కోట్ల బకాయిలు రావాల్సి ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 కోట్లకు పైగా వసూలు చేశారు.
నగరపాలక సంస్థకు ఏళ్ల తరబడి ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిల వసూళ్ల విషయంలో కమిషనర్, డిప్యూటీ కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. శుక్రవారం గురుద్వారాకు సంబంధించి వాణిజ్య దుకాణాల యజమానులకు నోటీసులు అందించారు. తక్షణమే ఆస్తి పన్ను చెల్లించాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీరితోపాటు వివిధ వ్యాపార సంస్థలకు అధికారులు నోటీసులు ఇచ్చారు.