కొడిమ్యాల, అక్టోబర్ 11: చొప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ను ఆశీర్వదించాలని, కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాలకు మేలు చేస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు మరోసారి అండగా నిలువాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులతో ఒరిగిందేమీ లేదని, రాష్ర్టాన్ని, ఈ దేశాన్ని 60 ఏండ్లు పాలించినా ఏ ఒక్క మంచి పనైనా చేయలేదని, గోదావరిపై ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని, మన నీళ్లు ఆంధ్రాప్రాంతానికి తరలిపోతుంటే, రైతులు ఆగమైనా చోద్యం చూశారే తప్ప ఏమీ చేయలేకపోయారని మండిపడ్డారు.
కానీ సీఎం కేసీఆర్ గోదావరిపై ఆరు ప్రాజెక్టులు నిర్మించి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసి, సాగు, తాగు నీటి కష్టాలు తీర్చారన్నారు. చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మంగళవారం కొడిమ్యాల మండలం నల్లగొండలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా, వినోద్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నల్లగొండ, తిప్పాయిపల్లి, శ్రీరాములపల్లి, నమిలకొండ, గోపాల్రావుపేట, పూడూర్, గౌరాపూర్, నర్సింహులపల్లి గ్రామాల్లో ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 7 వేల మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అయ్యేదని, దీంతో అప్పటి ప్రభుత్వం పక్క రాష్ర్టాల్లో విద్యుత్ను కొనుగోలు చేసి సరఫరా చేసే పరిస్థితి ఉండేదన్నారు. అయినా కరెంట్ కోతలతో రైతులు, ప్రజలు ఆగమైపోయేవారన్నారు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషితో 26 వేల మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేసుకుంటున్నామని, కొనుక్కునే స్థాయి నుంచి మనమే ఇతర రాష్టాలకు అమ్మే స్థాయికి ఎదిగామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ మతోన్మాద పార్టీ అని, మతాల మధ్య చిచ్చుపెట్టడం తప్ప తెలంగాణలో చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు.
కేంద్ర హోంమంత్రి అమిత్షాకు రాష్ట్రంపై ఏ మాత్రం అవగాహన లేదని, రెండ్రోజుల క్రితం సభలో కేవలం స్థానిక నాయకులు రాసిచ్చిన స్క్రిప్టు మాత్రమే చదివారు తప్ప, ఇప్పటి వరకు తెలంగాణలో ఎంత ధాన్యం పండుతున్నదో కూడా తెలువదని ఎద్దేవా చేశారు. అలాంటి పార్టీలతో రాష్ర్టానికి ఒరిగిందేం లేదని మండిపడ్డారు. వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబంపై అధ్యయనం చేస్తామని, సూక్ష్మ ప్రణాళిక (మైక్రో ప్లానింగ్) తయారు చేయనునట్లు చెప్పారు. ప్రతి కుటుంబం స్థితిగతులను తెలుసుకొని అభివృద్ధి చేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు.
నమ్మితే మోసపోతాం
చొప్పదండి నియోజకవర్గం బీఆర్ఎస్ అడ్డా. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా పని చేసిన వారు ఏం చేయలేదు. కానీ, నేను కోట్లాది రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. రహదారులు, సీసీ రోడ్లు, కుల సంఘాల భవనాలు, కోట్ల నిధులు మంజూరు చేశా. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం కోసం పని చేస్తున్నా. ఎన్నికల ముందు మాయమాటలతో మొసలి కన్నీరు కార్చే నాయకుల మాటలు నమ్మితే మోసపోతాం. బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం. మరోసారి ఆశీర్వదించి గెలిపించాలి. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలి.
– సుంకె రవిశంకర్, చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే