నమస్తే నెట్వర్క్, జనవరి 22: అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఊరూరా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. శోభాయాత్రలు, భజనలతో సర్వత్రా భక్తిభావం వెల్లివిరిసింది. ఇంటిళ్లిపాది ఆలయాలకు వెళ్లి శ్రీరామ కల్యాణం తిలకించారు. అనంతరం అక్షింతలు వేసుకుని శ్రీరాముడి ఆశీర్వాదం పొందారు. నగరంలోని మహాశక్తి ఆలయంలో అయోధ్య ఆలయ సైకత శిల్పం అందరిని ఆకట్టుకుంది. ఇక్కడ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ సైకత శిల్పం వద్ద పూజలు చేశారు.
తన నివాసంలో రామ కల్యాణాన్ని జరుపుతూ ప్రత్యక్ష ప్రసారాన్ని కుటుంబసభ్యులతో కలసి వీక్షించారు. అలాగే యజ్ఞవరాహ క్షేత్రంలో దర్బార్ సేవ, రాజోపచారాలు, సాయంత్రం దీపోత్సవం, రామనామ సంకీర్తన జరిపారు. పాతబజార్ గౌరీశంకరాలయంలో సీతారామ కల్యాణం నిర్వహించారు. ప్రకాశంగంజ్ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో అష్టోత్తర శత కలశాభిషేకం, దీపమాలికాసేవ, 108 మందిచే కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కరీంనగర్లోని ఐఎంఎ హాల్లో వైద్యులు ప్రాణ ప్రతిష్ఠను నిర్వహించారు. కరీంనగర్ మండలంలోని దుర్శేడ్లో ఉత్సవ మూర్తులకు పల్లకీ సేవ నిర్వహించారు.
చెర్లభూత్కూర్లోని వేణుగోపాల స్వామి, సీతారామచంద్రస్వామి ఆలయాల్లో శ్రీరామ యజ్ఞం నిర్వహించారు. పలు ఆలయాల్లో అభిషేకం, ఫల పంచామృతాభిషేకాలు, అర్చనలు, లక్షదీపోత్సవం, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు.
కరీంనగర్లోని మానేరు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, భరతుడు, హనుమంతుడు వేషధారణతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, డైరెక్టర్ కడారి సునీతారెడ్డి పాల్గొన్నారు. అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు అభిషేకాలు నిర్వహించారు.
చిందు యక్షగాన కళాకారులు శ్రీ రామాయణ కళారూపాన్ని ప్రదర్శించారు. సాయంత్రం సహస్ర దీపోత్సవం నిర్వహించారు. ఈవో సుధాకర్, యప్టీవీ సీఈవో పాడి ఉదయ్నందన్రెడ్డి, సర్పంచ్ శ్రీలతాసురేందర్రెడ్డి పాల్గొన్నారు. కేశవపట్నంలో హనుమాన్ ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు తనుకు ఓంకారం, అధ్యక్షుడు తనుకు ప్రభాకర్ ఆధ్వర్యంలో శివాలయం నుంచి హనుమాన్ ఆలయం వరకు ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించారు. తాడికల్ మార్కండేయ ఆలయంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పఠించారు. కన్నాపూర్ ఆలయ ఆవరణలో భారీ కాషాయ పతాకాన్ని ఆవిష్కరించారు. ధర్మారం-కన్నాపూర్ శివారులోని వాలీ సుగ్రీవాంజనేయ రామాలయంలో రాత్రి దీపారాధన చేశారు. సైదాపూర్లో సీతారామ, లక్షణ, హనుమంతుడి విగ్రహాలతో ర్యాలీ నిర్వహించారు.
జమ్మికుంట, హుజూరాబాద్, మానకొండూర్, తిమ్మాపూర్, వీణవంక, చొప్పదండి, చిగురుమామిడి మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. హుజూరాబాద్లోని మాంటిస్సోరి, టెట్రా హెడ్రన్, గంగాధర మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలల్లో విద్యార్థులు రాముడు, సీతా, లక్ష్మణుడు, హనుమంతుడి రూపాల్లో ఆకట్టుకున్నారు. పాఠశాలల ఆవరణలో ‘జైశ్రీరాం’ అక్షర ఆకృతిలో కూర్చుండి భక్తిని చాటుకున్నారు. మానకొండూర్లోని బాలాంజనేయస్వామి ఆలయంలో జడ్పీటీసీ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శేఖర్గౌడ్ పూజలు చేశారు.
కాగా, ఆలయాల ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా అయోధ్య రాముడి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తులు వీక్షించారు. ఆయా చోట్ల అన్నదానం నిర్వహించారు. రామడుగు మండలం వెలిచాల శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సర్పంచ్ సరోజనాప్రభాకర్రావు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్వరరావు పూజల్లో పాల్గొన్నారు. గన్నేరువరం మండలం ఖాసీంపేట మానసాదేవి ఆలయంలో సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.
గంగాధర మండలం గట్టుభూత్కూర్కు చెందిన దొంతి జనార్దన్రెడ్డి, గంగాధర మల్లయ్య, బొల్లబత్తిని లక్ష్మణ్, మంచాల రాజేశం, పూదరి రవి 1990లో అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని చేసిన పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనగా, వారిని సర్పంచ్ కంకణాల విజేందర్రెడ్డి సన్మానించారు. కరీంనగర్లోని రెనే హాస్పిటల్లో కర సేవలో పాల్గొన్న కరీంనగర్ కర సేవకులను సాయిని మల్లేశం, బొమ్మకంటి కిషన్, కోమల ఆంజనేయులు, గుజ్జ శ్రీనివాస్, సూర్యభానును హాస్పిటల్ చైర్మన్, ప్రొఫెసర్ డాక్టర్ బంగారి స్వామి సన్మానించారు.