Awareness CPR | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, అక్టోబర్ 15: సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిసోసియేషన్)పై అందరికీ తప్పనిసరిగా అవగాహన ఉండాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పేర్కొన్నారు. సీపీఆర్ అవగాహన వారోత్సవాల సందర్భంగా ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు జిల్లా సమీకృత కార్యాలయాల సము దాయంలోని ఆడిటోరియంలో బుధవారం అన్ని శాఖల ఉన్నతాధికారులు, సిబ్బందికి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ స్వయంగా సీపీఆర్ చేసి చూపించగా, ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగార్జున మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అందరికీ సీపీఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఒక వ్యక్తికి అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టు అయిన ప్పుడు వారికి సీపీఆర్ చేసినట్లయితే ప్రమాదం నుంచి కాపాడగలుగుతామన్నారు. ఇది లేకపోవడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని, సీపీఆర్ ట్రైనింగ్ సడన్ కార్డియాక్ అరెస్టు అయినప్పుడు ప్రథమ చికిత్స అందించాలని పేర్కొన్నారు.
కార్డియాక్ అరెస్టు అయిన వారి వివరాలు 108 అంబులెన్స్ కు సమాచారమిస్తూ, వాహనం వచ్చే వరకు సీపీఆర్ చేస్తూ, ఊపిరి అందిస్తే ఒక నిండు ప్రాణాన్ని కాపాడొచ్చని తెలిపారు. పలువురు ఉద్యోగులతో సీపీఆర్ ధానాన్నితెలుసుకున్నారు. పలువురు ఉద్యోగుల అనుమానాలు నివృత్తి చేశారు. సీపీఆర్ అనేది సడన్ కార్డియాక్ అరెస్టు, స్పందనలో కీలకమైనదని, గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు, మెదడు ఇతర ముఖ్యమైన అవయవాలకు రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడి వెంటనే సహాయం అందించకపోతే మెదడు దెబ్బతినడం లేదా మరణం నిమిషాల్లో సంభవిస్తుందని తెలిపారు. అవగాహన కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ రజిత, వైద్యులు, జిల్లా అధికారులు, ఇతర శాఖల సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.