Auto workers begging | సిరిసిల్ల టౌన్, జూలై 3: ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడంపై ఆటో కార్మికులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆటో కార్మికులకు అండగా ఉంటామని అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్లో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ) ఆధ్వర్యంలో గురువారం ప్రయాణికుల వద్ద భిక్షాటన చేసి తమ నిరసనను తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చి ఆటో కార్మికులకు రోడ్డున పడేసిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది రూ.12వేలు ఆర్థిక సహకారం అందిస్తామని చెప్పారన్నారు. మహాలక్ష్మీ పథకం అమలుతో ఆటో కార్మికులు కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితులలో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇంటి అద్దె, ఆటో ఫైనాన్సులు చెల్లించలేక రోడ్డున పడుతున్నారని వాపోయారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు 142 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో కార్మికులు భిక్షాటన చేసుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. అసెంబ్లీ వేదికగా ఆటో కార్మికులకు అండగా నిలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆటో కార్మికుల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి రూ. వెయ్యి కోట్లు నిధులు కేటాయించాలన్నారు. ప్రతి కార్మికుడికి రూ.10లక్షలు భీమా సౌకర్యం కల్పించాలని, సంవత్సరానికి రూ.15వేలు ఆర్ధిక సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కనకం శ్రీనివాస్, సలీం, పులి నాగరాజు, గాండ్ల శ్రీనివాస్, చింత విక్కీ, మల్యాల దేవరాజ్, రేగుల రవి తదితరులు పాల్గొన్నారు.