కరీంనగర్ తెలంగాణచౌక్, డిసెంబర్ 30 : ఆటో డ్రైవర్లు కదం తొక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు నిరసనగా రోడ్డెక్కారు. మహిళలకు బస్సు ఫ్రీజర్నీకి అవకాశం ఇవ్వడంతో తమ బతుకులు ఆగమయ్యాయని, కుటుంబాలు గడువలేని పరిస్థితి నెలకొన్నదని, వెంటనే ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టారు. అంతకుముందు తెలంగాణ చౌక్ నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకొని, దాదాపు రెండు గంటల పాటు ధర్నా చేశారు.
ఈ సందర్భంగా ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడు తూ, తమ జీవన మనుగడ కోసం ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మహాలక్ష్మి పథకాన్ని వ్యతిరేకించడం లేదని, కానీ ఉచిత ప్రయాణంతో రోజూ రూ.వెయ్యి సంపాందించి కుటుంబాన్ని పోషించుకునే ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతిన్నదని, రాష్ట్ర వ్యాప్తంగా 17లక్షలు, జిల్లాలో 15వేల కుటుంబాలు రోడ్డునపడ్డాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి కిరాయి, పిల్లల చదువు, ఆటో ఫెనాన్స్లు కట్టలేని పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గతంలో జిల్లా ఆటో యూనియన్ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా పనిచేశారని, ఆయనకు మా బాధలు అన్నీ తెలుసునని, వెంటనే స్పందించి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు నెలకు 15వేల జీవన భృతి చెల్లించాలని, ఇంకా ఇందిరమ్మ ఇండ్లలో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, మహాలక్ష్మి పథకాన్ని పునః పరిశీలించాలని డిమాండ్ చేశారు. తమను ఆదుకోకుంటే రాష్ట్ర ఆటో డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మహా ధర్నాలో నగర అధ్యక్షుడు రాజేందర్ నాయకులు శ్రీనివాస్, జనార్దన్, రవీందర్, నగర ఆటో డ్రైవర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.