హుజూరాబాద్టౌన్, డిసెంబర్ 20: ఆటోడ్రైవర్లు, కార్మికులు ఆందోళన ఉధృతమవుతున్నది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నది. మహాలక్ష్మి పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తాము రోడ్డునపడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో జమ్మికుంట రూట్ ఆటో యూనియన్ అధ్యక్షుడు సిరికొండ శరత్, మాజీ అధ్యక్షుడు ఎస్కే ఫయాజ్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ఆర్డీఓ కార్యాలయం దాకా ర్యాలీ తీసి, ఆర్డీవో ఎస్ రాజుకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తమ పొట్ట మీద కొట్టిందన్నారు. తమకు ఉపాధి కల్పించాలని, నెలనెలా జీవనభృతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో జమ్మికుంట, హన్మకొండ, కరీంనగర్, తదితర రూట్ల ఆటోడ్రైవర్లు పాల్గొన్నారు.