జమ్మికుంట, జూన్ 16: సీఎం కేసీఆర్ కృషి, పట్టుదలతోనే పట్టణాల అభివృద్ధి జరిగిందని, స్వరాష్ట్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమాలతో సరికొత్తగా మున్సిపాలిటీలు మారాయని మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి పట్టిన శని ఈటల రాజేందర్ అని, ఆయన వెళ్లి పోయిన తర్వాతే నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. నియోజకవర్గానికి ఇప్పటి వరకు రూ.7వేల నుంచి 10వేల కోట్ల నిధులు వెచ్చించారని, దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి జరుగుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జమ్మికుంట మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి హాజరయ్యారు. ఆయనకు మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, కమిషనర్ శ్రీనివాస్, పాలకవర్గం, అధికారులు, తదితరులు స్వాగతం పలికారు. ముందుగా తెలంగాణ చౌక్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం మానవహారం నిర్వహించారు. గాంధీ చౌక్ నుంచి పాత మున్సిపల్ వరకు ర్యాలీగా వెళ్లారు. కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలి విప్ మాట్లాడారు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ను బలపరచాలని, ఆయన వెంట నడవాలని పిలుపునిచ్చారు. ఇక్కడి శాసన సభ్యుడు గతంలో మంత్రిగా పనిచేశారని, ఆయన వ్యక్తిగత లాభం కోసమే పాటుపడ్డారని విమర్శించారు. ప్రజల సమస్యలు, అభివృద్ధిని గాలి వదిలేశాడని దుయ్యబట్టారు. ఆయన హయాంలో హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో చేసిన తప్పిదాన్ని మరోసారి చేయవద్దని కోరారు. అభివృద్ధిపై ధ్యాసలేని ఎమ్మెల్యే మనకు అవసరం లేదని పేర్కొన్నారు. తనకు ఓ అవకాశం ఇవ్వాలని, నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు.
నియోజకవర్గానికి నిధుల వరద
నియోజకవర్గంలో ఇప్పటి వరకు రైతు బంధు కింద రూ.523.77కోట్లు, 24గంటల ఉచిత కరెంటు సబ్సిడీ రూ.1776 కోట్లు, కాళేశ్వరం జలాలతో లక్షా 15వేల ఎకరాలకు నీరు, రైతు బీమా 840 మందికి రూ.42కోట్లు, కల్యాణలక్ష్మి 10వేల మందికి రూ.88కోట్లు, కేసీఆర్ కిట్లు 26వేల మందికి రూ.7కోట్ల 90లక్షలు, పింఛన్లు 44వేల మందికి రూ.10కోట్లు(నెలకు), రూ.120కోట్లు (సంవత్సరానికి), మిషన్ కాకతీయ చెరువులకు రూ.150కోట్లు, దళిత బంధు కోసం రూ.2వేల కోట్లు కేటాయిస్తే.. ఇప్పటి వరకు రూ.18వందల 21లక్షలు గ్రౌండింగ్ పూర్తి చేశామని చెప్పారు. అలాగే జమ్మికుంటలో 5వేల 350మందికి పింఛన్లు.. రూ.కోటీ 2 7లక్షలు(నెలకు) అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల జమ్మికుంటకు కేటీఆర్ రాగా, మహిళల కోసం రూ.100 కోట్ల రుణాలు అందించాలని కోరానని.. దాన్ని దృష్టిలో పెట్టుకున్న మంత్రి కేటీఆర్ నియోజకవర్గ మహిళల కోసం రూ.238కోట్ల 5లక్షలు ఇచ్చారని చెప్పారు. మహిళలంతా పనిచేసే సర్కారుకు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. జమ్మికుంటలో ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, రోడ్లు, డ్రైనేజీలు, హరితహారం, తదితర అభివృద్ధి పనులను గొప్పగా తీర్చిదిద్దామని చెప్పారు. నాయిని చెరువును అద్భుతంగా తయారు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఉత్తమ అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఇక్కడ వైస్ చైర్మన్ దేశిని స్వప్న-కోటి, ఆర్డీవో హరిసింగ్, తహసీల్దార్ రాజేశ్వరి, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.